తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో అనూహ్య పరిణామాలు , మరెన్నో సంచలనాలు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తూ వస్తున్న ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించి కేసీఆర్ అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
తమ పార్టీలో కానీ , ప్రభుత్వంలో గానీ ఎటువంటి అసంతృప్తులు ఉన్నా, తమకు వ్యతిరేకంగా ఏ కార్యకలాపాలు నిర్వహించినా ఉపేక్షించేది లేదు అనే సంకేతాలు ఇచ్చారు.ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి.
ఒకవైపు ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేక పెరుగుతున్న సమయంలో, బిజెపి పుంజుకుంటున్న ఈ సమయంలో ఈటెల రాజేందర్ వంటి బలమైన నాయకులను వదులుకోవడం అంటే కెసిఆర్ సాహసం చేశారనే చెప్పుకోవాలి.అయితే ఇది ఆయన ఒక్కడితో ఆగిపోలేదని, మరికొంత మంది మంత్రులు ఎమ్మెల్యేల పైన కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని, కొంతమందిని మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి తగ్గట్టుగానే ఓ ఆంగ్ల పత్రికలో తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి సంబంధించిన కథనం సంచలనంగా మారింది. దీనిని బలపరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత దుమారాన్ని రేపుతోంది.
ఈ ఏడాది జనవరిలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన కొడుకు పుట్టిన రోజు వేడుకలను హంపిలో నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ వ్యవహారంపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా కెసిఆర్ పరిపాలన పై కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, అభ్యంతకర పదజాలంతో విమర్శలు చేశారు.అంతేకాదు ఒక ఎమ్మెల్యే అత్యుత్సాహంతో కెసిఆర్ పై వ్యంగ్యంగా ఒక పాట కూడా పాడడం , అక్కడ జరిగిన వ్యవహారాలు మంత్రి కేసీఆర్ కు చేరిపోవడంతో ఆయన అప్పటి నుంచి సదరు ఎమ్మెల్యేలు, మంత్రి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
ఇప్పుడు ఈటెల తరువాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి నే కెసిఆర్ తప్పించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది .వాస్తవంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు .టిఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనూ, రెండో విడత అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి అవకాశం కల్పించారు.అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఉన్న కెసిఆర్ ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పైన వేటు వేయబోతున్న ట్లు తెలుస్తోంది.అలాగే ఆ ఫంక్షన్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.రసకందాయంలో హంపి ధూమ్ దామ్.కోవర్ట్ క్రాంతి కిరణాలతో కకావికలం.యముడు జగదీశ్వర్ రెడ్డి ఘంటా కొట్టినట్టేనా అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.