తెలంగాణలో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతమే కాకుండా ముందు ముందు జరిగే ఎన్నికల్లో కూడా తిరుగులేదు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడడం, బిజెపి పుంజుకుంటుందని ముందుగా అందరూ భావించినా ఆ పార్టీ పరిస్థితి కూడా కాంగ్రెస్ మాదిరిగానే ఉండడంతో టీఆర్ఎస్ కు తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యర్ధులు ఎవరూ లేరు.
దీంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏ ఆటంకం లేకుండా అమలవుతోంది.కెసిఆర్ కూడా తమకు ఎదురు ఎవరు నిలబడకూడదు అన్నట్లుగానే వ్యవహారం చేస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, ఇతర పార్టీలను బలహీనం చేసే క్రమంలో కెసిఆర్ కాంగ్రెస్, బిజెపి, టిడిపి నుంచి పెద్ద ఎత్తున నాయకులను, ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.అలా వలస వచ్చిన వారికి, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు మధ్య ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు పెరిగిపోవడంతో టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులు ఉండడంతో ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ ఒకరికి ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు.టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ లను సైతం పక్కనపెట్టి జూనియర్లకు చాలామందికి మంత్రి పదవులు దక్కడంతో సీనియర్లంతా ఆగ్రహం గానే ఉన్నారు.ఆ ఎఫెక్ట్ ఇప్పుడు నియోజకవర్గాల్లో బాగా కనిపిస్తోంది.సీనియర్ వెర్సెస్ జూనియర్ అన్నట్టుగా అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి నెలకొంది.ఈ పోరులో మంత్రులకు మంత్రులకు, మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య తరచుగా విభేదాలు తలెత్తుతున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా నే తీసుకుంటే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయిలో ముదిరిపోయింది.
తరచుగా వీరి వర్గాల మధ్య విభేదాలు హై కమాండ్ కు తలనొప్పిగా మారాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్యాబినెట్లో నలుగురు మంత్రులు ఉన్నారు.
కేటీఆర్ ను పక్కన పెడితే ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ మధ్య ప్రోటోకాల్ సమస్య ఎక్కువగా ఉంది.ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడంలేదు.ఖమ్మం జిల్లా విషయానికి వస్తే జూనియర్ అయిన పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి రావడంతో పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇతర ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది.
నల్గొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి కి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మధ్య వివాదం నడుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ల మధ్య విభేదాలు ఉన్నాయి.ఇలా ఎక్కడికక్కడ పార్టీ సీనియర్ నాయకులు మధ్య తగాదాల ఎక్కువ అవ్వడం అధినేత కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తోంది.ఈ విషయంలో కెసిఆర్ ఎన్నిసార్లు హెచ్చరించినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదట.