చంద్రబాబు తనయుడు , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి సొంత పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా లోకేష్ నాయకత్వ లక్షణాలపై ఈ చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.
అసలు లోకేష్ కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించలేరు అని , రాజకీయంగా ఎత్తుగడలు, ఆయన పెర్ఫార్మెన్స్ అంతంతమాత్రంగానే ఉంటుంది అనేది అందరి మాట.అందుకే నారా లోకేష్ రాజకీయ పెత్తనాన్ని ఒప్పుకునేందుకు టిడిపి నేతలు అంతగా ఇష్టపడరు.మొదట్లో లోకేష్ రాజకీయ వ్యవహారం నచ్చని టిడిపి నేతలు బహిరంగంగానే ఆయన తీరును అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించి మరి విమర్శించేవారు.ఆ తరువాత లోకేష్ పనితీరు కాస్త మెరుగుపడినట్టు కనిపించినా, జగన్ స్థాయి వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమాత్రం సరిపోవని విషయాన్ని చివరకు తేల్చారు.
ఇది గమనించి చంద్రబాబు ప్రతి విషయంలోనూ లోకేష్ ని ముందర పెట్టి రాజకీయం నడుపుతున్నారు.వైసిపి పైన విమర్శలు చేయాలన్న , పార్టీ నాయకులను పరామర్శించాలన్నా, టిడిపి కి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా లోకేష్ ఆధ్వర్యంలో జరిగే విధంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
ఇది కొంతమేర వర్కౌట్ అయినట్లు కనిపించినా, టిడిపి సీనియర్ నేతల్లో మాత్రం ఇంకా లోకేష్ నాయకత్వంపై అసంతృప్తి కనిపిస్తోంది.లోకేష్ కాకపోయినా మరెవరూ వచ్చినా, తమకేమీ ఇబ్బంది లేదని, కానీ లోకేష్ శక్తి సామర్ధ్యాలు ఏ మాత్రం సరిపోవు అనేది టీడీపీ సీనియర్ల వాదన.
టిడిపి కి సంబంధించి ఎంతోమంది కీలక నాయకులు బయటకు వెళ్లిపోయారని, మరెంతో మంది అసంతృప్తితో పార్టీకి దూరం అయ్యారని, ఇంకొంతమంది అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్నారని దీనంతటికీ కారణం లోకేష్ అనేది టిడిపి సీనియర్ల అభిప్రాయం. గతంతో పోలిస్తే లోకేష్ కాస్త మెరుగుపడినట్లుగా కనిపించినా, అది ఏమాత్రం సరిపోదని బహిరంగంగానే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నెలకొంది.లోకేష్ కేవలం సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అదే రాజకీయం అనుకుంటున్నారని, కానీ ఇది ముందు ముందు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుందనేది టిడిపి సీనియర్ల ఆవేదన.