పార్టీ గెలిచినా, ఓడిన తమకు అనవసరం, తమ పంతం మాత్రమే నెగ్గాలి అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు మంచి గుర్తింపు జనాల్లో ఉన్నా , దానిని ఉపయోగించుకుని ఓట్ల రూపంలో దానిని పొందడంలో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ విషయం కంటే తమ రాజకీయ ప్రాధాన్యం విషయంపైన ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తాము తప్ప ఎవరికీ సరైన ప్రాధాన్యం దక్కకపోవడం , ఇతర ఆలోచనలతో ఉండటం తదితర కారణాలతో తెలంగాణ కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందా అంటే ఇప్పుడు అదే తరహా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.
రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా ఒప్పుకునేది లేదు అంటూ కాంగ్రెస్ సీనియర్లంతా మూకుమ్మడిగా స్టేట్మెంట్లు ఇవ్వడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి.
ఇక ఆ తంతు ముగిసినా, తమ అసంతృప్తి అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.ఇక హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడం పై అధిష్టానం ఇటీవల సమీక్ష నిర్వహించినా, ఆ సమీక్షలోనూ రేవంత్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా ఫిర్యాదులు చేశారు.
అసలు 2018 ఎన్నికల్లో హుజురాబాద్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 60 వేల ఓట్ల వరకు వచ్చాయి.అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే దక్కించుకోవడం, కాంగ్రెస్ కు పెద్ద అవమానమే.
అయితే దాని పై సమీక్ష చేసుకోవాల్సి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పుడు రేవంత్ ఒక్కడినే టార్గెట్ చేసుకుని ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది.
మొదటి నుంచి రేవంత్ కానీ , కాంగ్రెస్ సీనియర్లు కానీ, పెద్దగా దృష్టి పెట్టలేదు .హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో బలమైన నాయకుడుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు గా ముందు నుంచే ప్రచారం జరిగినా, ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.అలాగే నియోజకవర్గానికి పెద్దగా పరిచయం లేని స్థానికేతరులను హుజురాబాద్ అభ్యర్థిగా నిలబెట్టడం వంటిది తప్పిదాలు కాంగ్రెస్ ఓటమి లో భాగం అయ్యాయి.
అయితే ఈ విషయాల పై సమీక్ష నిర్వహించుకుని రాబోయే రోజుల్లో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే విషయంపై కాంగ్రెస్ నాయకులెవరూ పెద్దగా దృష్టి పెట్టకుండా, కేవలం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని రేవంత్ ను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నారు.