అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ రాకతో అక్కడ వ్యవస్థ అంతా మారిపోతోంది.దేశాధినేతగా తన మార్క్ కనిపించేలా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు రిపబ్లికన్ల ఆధిపత్యం వున్న సెనేట్లో డెమొక్రాట్లు పైచేయి సాధించారు. బైడెన్ బాధ్యతలు స్వీకరించిన క్రమంలోనే… కొత్తగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రాటిక్ పార్టీ సెనేటర్లు కూడా ప్రమాణం చేశారు.
జార్జియా నుంచి పాత్రికేయుడు ఒస్సోఫ్, అట్లాంటా నుంచి పాస్టర్ వార్నాక్, కాలిఫోర్నియా నుంచి అలెక్స్ పడిల్లాలలు సెనేటర్లుగా గెలుపొందారు.వీరితో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణం చేయించారు. సాధారణంగా కొత్త అధ్యక్షుని ప్రమాణం రోజు… ఆయన యంత్రాంగానికి సంబంధించిన కొన్ని నియామకాలకు సెనేట్ ఆమోదం తెలపడం ఆనవాయితీ.ఈ మేరకు బుధవారం సాయంత్రం కొత్త సభ్యుల ప్రమాణం అనంతరం సభ సమావేశమైంది.
అధ్యక్షుని భద్రతను పర్యవేక్షించే ‘నేషనల్ ఇంటెలిజెన్స్’ డైరెక్టరుగా బైడెన్ నామినేట్ చేసిన అర్విల్ హైనెస్ నియామకానికి 84-10 ఓట్ల తేడాతో సెనేట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు ట్రంప్పై డెమొక్రాట్లు ప్రతిపాదించిన అవిశ్వాసం తీర్మానానికి ప్రతినిధుల సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
ఈ తీర్మానాన్ని స్పీకర్ నాన్సీ పెలోసీ త్వరలోనే సెనేట్ ఆమోదం కోసం పంపనున్నారు.ట్రంప్ తన జీవితకాలంలో మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవకుండా నిషేధం విధించాలని పలువురు చట్టసభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో- మాజీ అధ్యక్షునిపై అభిశంసన విచారణ సందర్భంగా సెనేట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.
అమెరికాను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకూ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని జో బైడెన్ ప్రతిపాదించారు.దీనిని కాంగ్రెస్ పరిశీలించి, ఆమోదించనుంది.