టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అంటే కచ్చితంగా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.మన చుట్టూ జరిగిన కథలు, తెలిసిన కథలనే కాస్తా భావోద్వేగాలు జోడించి తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటాడు.
తనకి గుర్తింపు తీసుకొచ్చిన ఆనంద్ సినిమా నుంచి ప్రస్తుతం తీసిన లవ్ స్టొరీ మూవీ వరకు అతని అన్ని సినిమాలు కథ కంటే పాత్రలు, ఆ పాత్రల మధ్య భావోద్వేగాల సమాహారంగానే ఉన్నవే.ప్రేక్షకులకి కావాల్సిన ఎమోషనల్ ఎలిమెంట్స్ ని తెరపై అందంగా, ఆవిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల బెస్ట్ అని చెప్పాలి.
అనామిక తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కమ్ముల ఫిదా సినిమాతో మళ్ళీ తన బెంచ్ మార్క్ నేరేషన్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమాతో హీరోయిన్ సాయి పల్లవిని ఏకంగా స్టార్ ని చేసేశాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శేఖర్ కమ్ముల సాయి పల్లవి, నాగ చైతన్య జోడీగా లవ్ స్టోరీ అనే మూవీని తెరకెక్కించారు.ఇందులో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ పల్లెటూరిలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఎమోషనల్ లవ్ జర్నీని చూపించబోతున్నారు.
ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.ప్రేమించుకొని ఊరి నుంచి లేచిపోయిన ప్రేమ పక్షుల కథగా ఇది ఉంది.ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చిన శేఖర్ కమ్ముల ఈ లవ్ స్టోరీలో ఎలాంటి ఎమోషన్ ని తెరపై ప్రెజెంట్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.సాయి పల్లవి మరో సారి తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమా ద్వారా మెప్పించడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.ఏప్రిల్ 16న సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.