రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర పరిస్థితి ఏంటో అన్న వారి ఆలోచనలకు గండి కొడుతూ.దూసుకుపోతుంది సీమాంధ్ర రాష్ట్రం.
తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో పరిశ్రమలకు పెద్ద పీట వెయ్యాలని అనేక పారిశ్రామికవేత్తలు సిద్దంగా ఉన్నారు.తాజా సమాచారం ప్రకారం.
మూడు వేల కోట్ల రూపాయలతో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి జైరాజ్ స్టీల్స్ ముందుకు వచ్చింది.ఇదే విషయమై చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
అంతేకాకుండా గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రా గ్లాసెస్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది.నిన్న పలువురు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు ఆన్ లైన్ విధానం , తగిన పద్ధతిన 21 రోజుల్లోనే అన్ని అనుమతులు కల్పిస్తామని వివరించారు.పారదర్శక విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఏపీలో భూములు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు.
ఏ ఇబ్బందులు లేకుండా చూస్తామని సైతం ఆయన స్పస్తం చేశారు.ఈ సందర్భంగా జైరాజ్ స్టీల్స్ ఎండీ ఎస్కే గోయంకా ఓర్వకల్లు మండలంలో 3 వేల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని వెయ్యి ఎకరాల భూమి, విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
జోడియాక్ క్లోతింగ్ కంపెనీ ఎండీ ఏ.వై.నూరానీ దేశ వ్యాప్తంగా తమకు ఉన్న యూనిట్లు ఒకే చోటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నామని చంద్రబాబుకు వివరించారు.ఇందుకోసం 22 ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన చేసిన విజ్ఞప్తికి ఏపీ సీఎం సానుకూలంగా స్పందించారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఔషధ పరిశ్రమ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులు కల్పిస్తే ఇతర రాష్ట్రాలలోని తమ యూనిట్లను ఏపీకి తరలిస్తామని వివరించారు.
ఇదే జరిగితే రానున్న కాలంలో సీమాంధ్ర పరిశ్రమలతో కళకళ లాడుతూ దూసుకుపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.