రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో త్వరలోనే రెండో రన్ వే వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.రెండో దశ మెట్రోకు శంకుస్థాపన చేసిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.
హైదరాబాద్ నగరాన్ని పవర్ ఐలాండ్ గా మార్చామన్నారు.న్యూయార్క్, లండన్ లో విద్యుత్ పోతుందేమో కానీ హైదరాబాద్ లో పోదని చెప్పారు.
హైదరాబాద్ లో 60 అంతస్తుల ఆకాశహర్మ్యాలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్న కేసీఆర్ త్వరలోనే రెండో రన్ వేను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
చరిత్రలో మొదటి కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ అన్నారు.హైదరాబాద్ అద్భుతమైన విశ్వనగరమని ఆయన కొనియాడారు.
సమైక్య పాలనలో హైదరాబాద్ సరైన రీతిలో అభివృద్ధి జరగలేదని తెలిపారు.విద్యుత్ కోసం ఇందిరా పార్క్ వద్ద పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసిన రోజులున్నాయన్నారు.
మంచి నీటి కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.తెలంగాణ వచ్చాక విద్యుత్, మంచి నీటి సమస్యలు అధిగమించామని వెల్లడించారు.