కరోనా ప్రభావం కారణంగా ఆరు వారాల పాటు ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.ఎన్నికలలో ఉపయోగించే పేపర్స్ వలన కరోనా వ్యాపించే అవకాశం ఉండటంతో పాటు, ఎక్కువగా జనాభా గుమిగూడటం జరుగుతుందని, ఈ ప్రభావం కరోనా విస్తరించడానికి అవకాశం ఉంటుందని, కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఏపీలో జరగబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలని ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.
అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో అధికార పార్టీకి, ముఖ్యమంత్రి జగన్ కి అస్సలు రుచించలేదు.
ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత మీడియా ముందుకి వచ్చిన జగన్ ఎన్నికల కమిషనర్ పై సంచలన వాఖ్యలు చేసారు.
అసలు ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేసారని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం ఉందని, తమని సంప్రదించకుండా, ఇక్కడి కరోనా ప్రభావం ఎలా ఉంది వైద్య ఆరోగ్య శాఖ వారితో రివ్యూ చేయకుండా ఎన్నికలు వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఇదంతా ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లబ్ది చేకూర్చడానికి ఆయన కులానికి చెందిన ఎన్నికల కమిషనర్ తీసుకున్న సొంత నిర్ణయం అని విమర్శించారు.ఆయనని తాము నియమించలేదని, చంద్రబాబు హయాంలో ఆయనని తీసుకొచ్చి పెట్టారని అన్నారు.
అందుకే స్వామి భక్తి చూపించుకోవడానికి కరోనా కారణం చూపిస్తున్నారని విమర్శించారు.అలాగే ఏవో చిన్న చిన్న కారణాలు చూపించి పోలీసులని బదిలీ చేసే హక్కు ఎవరిచ్చారని, అన్ని మీరే నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రిగా మాకు విలువ లేదా అంటూ విమర్శించారు.
ఇక ఇవే విమర్శలు వైసీపీ ఇతర నేతలు కూడా చేస్తూ ఎన్నికల సంఘం మీద మూకుమ్మడి దాడి చేసారు.అయితే తమది స్వాతంత్ర్య సంస్థ అని, హైకోర్టు చీఫ్ జస్టీస్ కి ఉండే అన్ని హక్కులు తమకి ఉంటాని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.