దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల వైరస్ అనే పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది.కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదని వైద్యులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని భావించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ కావడంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరుగుతోంది.
రష్యా వ్యాక్సిన్ సేఫ్ అని పలు అధ్యయనాలు చెబుతున్నా ఆ వ్యాక్సిన్ ను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు.
పూర్తిస్థాయిలో సమర్థవంతంగా మనుషులపై పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కోట్ల సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ అంత సులువైన విషయం కాదు.
ఇలాంటి సమయంలో కొత్త వైరస్ లు వెలుగులోకి వస్తూ ప్రజల్లో మరింత భయాందోళనను పెంచుతున్నాయి.
తాజాగా జర్మనీలో అడవి పందిలో కొత్త రకం వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ వైరస్ వల్ల స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతుందని….పంది మాంసం ఎగుమతి, దిగుమతులు జరిపే దేశాలపై ఈ వైరస్ ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాలను వెల్లడించింది.మంత్రి జూలియా క్లోక్నెర్ జంతు ఆరోగ్య సంస్థ మరిన్ని పరిశోధనలు జరిపి వివరాలను వెల్లడిస్తుందని తెలిపారు.
వైరస్ సోకిన మాంసాన్ని తినడం వల్ల పందులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని… మనుషులకు ఈ వైరస్ ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికే కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న జర్మనీకి స్వైన్ ఫీవర్ వల్ల మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైరస్ విషయం తెలిసి పలు దేశాలు పందుల ఎగుమతులపై నిషేధం విధించడం గమనర్హం.