ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది.చాలా నెలల తర్వాత ఎట్టకేలకు నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.తల్లిదండ్రుల అభిప్రాయలు తీసుకున్న తర్వాతనే స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతితోనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తమ విద్యార్థులను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తే ఆన్లైన్ క్లాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.రెండురోజులకు ఒకసారి క్లాసులు నిర్వహిస్తామని, ఒకవేళ 700కిపైగా విద్యార్థులు ఉంటే మూడ్రోజులకు ఒకసారి క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటాయని, మధ్యాహ్నం భోజనం పెట్టి ఇంటికి పంపిస్తామని ప్రభుత్వం తెలిపింది.నవంబర్ నెల వరకు ఈ పద్దతిలో స్కూళ్లు నిర్వహిస్తామని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామంది.
మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా స్కూళ్లు ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ పలు సూచనలు చేశారు.
స్కూళ్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జగన్ చెప్పారు.