ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజిస్తూ కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా గ్రీన్, ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు కూడా చేపడుతున్నారు.గత 40 రోజులుగా మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి మందుబాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాలు తెరిచేసరికి మద్యం దుకాణాలకు కిలోమీటర్లమేర క్యూ కడుతున్నారు.
అయితే మద్యం కోసం వందల సంఖ్యలో వైన్ షాపుల వద్ద బారులు జనాలు తీరుతుండడంతో వారిని అదుపు చేయడం కోసం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అదుపు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో కొందరు ఉపాధ్యాయులు మద్యం దుకాణాల వద్ద జనసాంద్రతను అదుపు చేసేందుకు విధులకు హాజరయ్యారు.
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. అలాగే పలువురు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచి పథంలో నడిపించేటువంటి ఉపాధ్యాయులను ఇలా మద్యం దుకాణాల వద్ద ప్రజలను కట్టడి చేయడం కోసం ఉపయోగించడం ఏంటని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఎంతో పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఉపాధ్యాయుడిని ఇలాంటి పనులకు ఉపయోగిస్తూ అవమాన పరచడం సరికాదంటున్నారు.
దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి
రాష్ట్రంలో ఉపాధ్యాయులు విషయంలో ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించడం లేదు.మరోవైపు మద్యం అమ్మకాలను కట్టడి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం ధరలను దాదాపుగా 75 శాతానికి పైగా పెంచింది.అయినప్పటికీ మద్యం అమ్మకాల జోరు మాత్రం తగ్గడం లేదు.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మందుబాబులు గత 40 రోజులుగా ఎంత మద్యం కరువుతో కొట్టుమిట్టాడుతున్నారో అని.