దేశంలోని జార్ఖండ్ లో ఒక స్కూల్ టీచర్ చేసిన పని విమర్శలకు దారి తీస్తుంది.కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు అన్ని కూడా మూతపడిన విషయం విదితమే.
ఈ క్రమంలో కొన్ని పాఠశాలలు వీడియో క్లాసులు చెబుతుండగా మరికొన్నీ విద్యాసంస్థలు మాత్రం ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ లోని తూర్పు సింఘ్ భూమ్ జిల్లా జంషెడ్ పూర్ పట్టణంలోని ఒక ప్రయివేట్ స్కూల్ టీచర్ శైలా పర్వీన్ వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది.
ఆన్ లైన్ లో ఎల్ కేజీ,యూ కేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు జాతీయ గీతం ను నేర్చుకోవాలి అంటూ సూచించారు.అయితే జాతీయ గీతం అంటే మనదేశ జాతీయ గీతం అనుకంటే పొరపాటే.
దేశ జాతీయ గీతం తో పాటు పొరుగు దేశం పాకిస్థాన్,బాంగ్లాదేశ్ జాతీయ గీతాలను కూడా పిల్లలు నేర్చుకోవాలి అంటూ సూచించడం గమనార్హం.ఎల్ కేజీ, యూ కేజీ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు చెబుతూ పాక్,బంగ్లా జాతీయ గీతాలను నేర్చుకోవాలి అంటూ హోమ్ వర్క్ ఇవ్వడమే కాకుండా వాటికి సంబందించిన యూట్యూబ్ లింకులను కూడా వారికి షేర్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయం పై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఇలా పొరుగుదేశాల జాతీయ గీతాలు నేర్చుకోమంటూ హోమ్ వర్క్ ఇవ్వడం పై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క ఈ విషయం ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి కునాల్ సారంగి తో పాటు పలువురులు రాజకీయ ప్రముఖులు తప్పుపడుతున్నారు.
ఆ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే టీచర్ మాత్రం మేనేజ్ మెంట్ నిబంధనలకు అనుగుణంగానే పిల్లలకు పాఠాలు చెబుతున్నానని, విద్యార్థుల జ్ఞానాన్ని పెంచడం కోసమే ఇలా చేసినట్లు తన చర్యను సమర్ధించుకుంటున్నారు.మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి.