బాబా రాందేవ్ లేదా రాందేవ్ బాబా ఎలా పిలిచినా ఆయన గురించి తెలియనివారు దేశంలోనే ఉండరు.అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయనకు.
యోగా గురువుగా ఎంతటి పేరుందో, వివాదాస్పదుడిగా అంతటి పేరుంది.ఆయన యోగా విన్యాసాలు, భంగిమలు దేశంలోని కోట్లాదిమందిని ఉత్తేజపరిచాయి.
స్ఫూర్తినిచ్చాయి.ఆయన తయారు చేసిన ఆయేర్వేద ఔషధాలతో ఊరూవాడా ‘పతంజలి’ మందుల దుకాణాలు వెలిశాయి.
ఆయన ఔషధాలను మెచ్చుకునేవారున్నారు.విమర్శించేవారూ ఉన్నారు.
రాందేవ్ రాజకీయాలు కూడా మాట్లాడతారు.ఆయన భాజపా మనిషని ఆ పార్టీని వ్యతిరేకించేవారు అంటారు.
ఇలా వార్తల్లో వ్యక్తిగా ఉన్న బాబా రాందేవ్ త్వరలో ‘డాక్టర్’ కాబోతున్నారు.ఇప్పటికే యోగాతో, ఆయేర్వేద మందులతో డాక్టర్గానే చెలామణి అవుతున్న ఈయన కొత్తగా డాక్టర్ కావడమేమిటని అనుకుంటున్నారా? డాక్టర్ కాబోయేది నిజమే.ఆయనకు హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ‘గౌరవ డాక్టరేట్’ ప్రదానం చేయబోతున్నది.ఈయనకు గౌరవ డాక్టర్ ప్రదానం చేయాలనే నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.కాని ఈ విమర్శలపై విశ్వవిద్యాలయ వర్గాలు ఏమీ కామెంట్ చేయడంలేదు.రాందేవ్ స్వరాష్ర్టం హర్యానాయే.
అక్కడ ఉన్నది భాజపా ప్రభుత్వమే.