ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య రాజకీయ సంబంధాలు బాగా దెబ్బతినడం, ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇక పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటు, 2024లో బీజేపీ జెండా ఏపీలో రెపరెపలాడించాలని చూస్తోంది.దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం ను అన్ని రకాలుగా ఇరుకున పెట్టే విషయాలపై దృష్టి సారించింది.
ఈ మేరకు విమర్శలు చేస్తూ, ఆ పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేందుకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో కేంద్ర నిధులు ఉన్నాయని, కేంద్రం నిధులు ఇస్తున్నా, ఏపీ ప్రభుత్వం వాటిని ఎక్కడ ప్రస్తావించకుండా, కనీసం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో సైతం వేయకుండా, జగన్ క్రెడిట్ కొట్టేస్తున్నారు అంటూ బీజేపీ ఇప్పుడు ఆరోపణలు మొదలుపెట్టింది.
తాజాగా చిరు వ్యాపారులకు పదివేల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చే పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
కరోనా కారణంగా వ్యాపారాలు లేక, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న చిన్న టీ స్టాల్స్ నిర్వహించేవారు ఈ లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పథకానికి నిధులు మంజూరు చేస్తోంది కేంద్రమని, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర ప్యాకేజీలో భాగంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రవేశపెట్టిందని, పీఎం స్వానిది పేరుతో ప్రారంభించగా, ఏపీలో ఆ పథకానికి పేరు మార్చు చేసి, జగనన్నకి తోడుగా మార్చారని బీజేపీ ఇప్పుడు విమర్శలు చేస్తోంది.ఈ విషయంపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామని, ఏపీ బిజెపి నాయకులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో పథకాలు అమలు చేస్తూ, జగన్ స్టిక్కర్ సీఎం గా మారిపోయాడు అంటూ బిజెపి విమర్శలు చేస్తోంది.
ఇకపై కేంద్రం ఇచ్చే నిధులతో అమలు చేసే పథకాలన్నిటికీ ముఖ్యమంత్రి ఫోటో తో పాటు, ప్రధాని ఫోటో కూడా వాడాలని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికీ ఏపీలో పీఎం కిసాన్ యోజన వంటి పథకాలను రైతు భరోసాగా ప్రకటించి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, కేంద్రం నేరుగా నిధులు రైతు ఖాతాలో వేస్తున్న, అది వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటోందని బిజెపి విమర్శలు చేస్తోంది.ఈ విమర్శలు ఇలా ఉంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు పథకాలను అమలు చేస్తున్నారు.
వీటిలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా పేరుమార్చి అమలు చేస్తున్నారు.
ఈ విషయం బిజెపి నాయకులకు బాగా తెలుసు.
అయితే అప్పట్లో వైసిపి బిజెపి సంబంధాలు మెరుగ్గా ఉండడం, జగన్ విషయంలో బిజెపి సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండటం వంటి కారణాలతో బిజెపి నాయకులు ఎవరూ, ఈ విషయాన్ని పట్టించుకోలేదు.ఇప్పుడు రెండు పార్టీల మధ్య వైరం మొదలవడంతో, ఈ అంశాన్ని హైలెట్ చేసి జగన్ కు క్రెడిట్ రాకుండా, బిజెపి ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
కానీ ఇప్పటికే బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇప్పుడు ఎంతగా నిట్టూర్పు లు చేసినా లాభం ఉండదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.