అప్పుడెప్పుడో వచ్చిన ‘రాజావారి చేపల చెరువు’ సినిమా గుర్తుందా? లేని చేపల చెరువును ఉన్నట్టు చూపించి బ్యాంకుల నుంచి రుణాలు ఎలా పొందారన్న ఇతివృత్తంతో వచ్చిన తెలుగు చిత్రం.అదే తీరును గుర్తు చేస్తూ, కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రాబ్యాంకులో దాదాపు రూ.3.3 కోట్ల విలువైన కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
గుడివాడ పరిసరాల్లో చేపల చెరువులను లీజుకు తీసుకున్నామని నకిలీ పత్రాలు సృష్టించిన ఏడుగురు వ్యక్తులు బ్యాంకుల నుంచి రూ.3.3 కోట్ల రుణం పొందగా, అదిప్పుడు వడ్డీతో కలిపి రూ.4.79 కోట్లకు పెరిగింది.రుణ బకాయిల వసూలుకు వెళ్లగా, అవి తప్పుడు చిరునామాలని, అసలు వారు చెప్పిన ప్రాంతంలో చెరువులే లేవని తేలాయి.
దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
రుణం తీసుకున్న మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవిలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.
రుణమిచ్చిన అధికారులు చెరువులు ఉన్నాయా? వీరి చిరునామాలు సరైనవేనా? పత్రాలన్నీ కరెక్టేనా? అన్న విషయాలు పరిశీలించకుండా రుణం ఇచ్చేయడం వెనుక అసలు విషయం బయటకు తీసేందుకు ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు.