వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.ప్రాజెక్టు నీటి మట్టం పెరగడంతో సరళా సాగర్ సైఫన్ గేట్లు 11 ఏళ్ల తర్వాత ఆదివారం తెరుచుకున్నాయి.
జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సైఫన్లు వాటంతట అవే తెరుచుకుని దిగవకు నీటిని విడుదల చేస్తున్నాయి.
సరళా సాగర్ చాలా ప్రత్యేకమైంది.
ఈ ప్రాజెక్టులో ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ ఉంది.ప్రాజెక్టులో నీరు నిండగానే.
ఆపరేటర్ లేకుండానే గాలి ఒత్తిడితో సైఫన్లు తెరుచుకుని నీటిని దిగువకు విడుదల చేస్తాయి.ఆసియా ఖండంలో ఇలాంటి టెక్నాలజీ సరళా సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే ఉంది.
ప్రపంచంలోనే ఇలాంటి టెక్నాలజీ ఉన్న రెండో ప్రాజెక్టు ఇదే కావడం విశేషం.ఇలాంటి మొదటి ప్రాజెక్టు అమెరికాలో ఉంది.
ఈ సరళా సాగర్ ప్రాజెక్టులో నాలుగు ప్రైమరీ సైఫన్లు, 17 ఉడ్ సైఫన్లు ఉన్నాయి.ప్రాజెక్టులో పూర్తిగా నీరు నిండగానే ప్రైమరీ సైఫన్లు తెరుచుకుంటాయి.
ఇన్ఫ్లో ఎక్కువగా కొనసాగుతుంటే ఉడ్ సైఫన్ల ద్వారా నీరు దిగువకు ప్రవహిస్తుంది.
వనపర్తి సంస్ధానాధీశుడైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళమ్మ పేరు మీద సరళా సాగర్ ప్రాజెక్టుకు నిర్మించారు.దీనిని 1949లో అప్పటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.1959లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.చివరిసారిగా 2009 సెప్టెంబర్ లో సైఫన్ల ద్వారా నీరు విడుదలైంది.ఆ తర్వాత ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ నీరు విడుదల అవుతోంది.