పెద్దపెల్లి జిలాల్లో ఈ రోజు జరిగిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య విషయంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే హత్య చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అంటూ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు.
ఇకపోతే టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలకు వ్యతిరేకంగా చాలామంది బాధితులు అడ్వకేట్ దంపతులను ఆశ్రయించారు.వీరిద్దరు నిజాయితీగా పేద ప్రజలకు అండగా నిలబడి న్యాయపరంగా పోరాడుతున్నారు.
ఇలాంటి వారిని కూడా చివరకు దారుణంగా హత్య చేయడం బాధాకరం అంటూ పేర్కొన్నారు.
అనేక సంచలనాలకు సంబంధించి కేసులను వాదిస్తున్న వామన్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిల్స్ వేశారు.
అదీగాక గతంలో శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో కూడా హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో తమకు ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించగా వారికి పూర్తి రక్షణ కల్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
కొంతమంది మంథనికి చెందిన అధికార పార్టీ నాయకులు పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసి ముఖ్యమంత్రి పుట్టినరోజు గిఫ్టుగా ఇచ్చారు.
ఈ ఘటన వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి.
ప్రభుత్వ పెద్దల హస్తముంది.ఈ హత్యలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేసినవే.
హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించి ఉంటే వారి ప్రాణాలు పోయేవి కాదు.టీఆర్ఎస్ ది దుర్మార్గ పాలన.
ప్రశ్నించే గొంతులను, ఎదురించే గొంతులను, అన్యాయాలను ఎదురించేవారిని అణచివేస్తోంది.ఇది అప్రజాస్వామికం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారట.