దేశంలో శర వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్ సహాయంతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
వైరస్ వ్యాప్తి వల్ల ప్రజల్లో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది.అయితే దేశంలో అమ్ముడవుతున్న శానిటైజర్లలో కల్తీ శానిటైజర్లే ఎక్కువగా ఉన్నాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.
కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీ.జీ.ఎస్.ఐ) తాజాగా శానిటైజర్ల గురించి అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.ఈ అధ్యయనంలో మొత్తం 122 శాంపిల్స్ ను పరీక్షించింది.ఈ శాంపిల్స్ లో ఐదు శాంపిల్స్ హానికరమైన మిథనాల్ ను కలిగి ఉన్నాయని తేలింది.40కు పైగా శాంపిల్స్ లేబుల్స్ తో సరిపోలడం లేదని వెల్లడైంది.సీ.జీ.ఎస్.ఐ మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఎట్టి పరిస్థితుల్లోను వాడ కూడదని సూచనలు చేసింది.
మిథనాల్ ఉన్న శానిటైజర్లను వాడితే అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇలాంటి హానికారకమైన రసాయనాలు ఉన్న శానిటైజర్ల ను వాడితే ఇర్రివర్సబుల్ ఆప్టికల్ నెర్వ్ డ్యామేజ్ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు సైతం కలుగుతాయని పేర్కొంది.గత నెల 31వ తేదీన సీ.జీ.ఎస్.ఐ అధ్యయన ఫలితాలను వెల్లడించింది.ముంబై, ముంబై పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న శానిటైజర్ల నమూనాలను సేకరించి ఫలితాలను వెల్లడించింది.
శానిటైజర్లలో ఆల్కాహాల్ కంటెంట్ ను పరిశీలించడంతో లేబుళ్లలో కెమికల్స్ ఉపయోగించిన కెమికల్స్ ను సరిపోల్చి కొన్ని శానిటైజర్లలో మిథనాల్ ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు.తయారీదారులు లేబుల్స్ లో ఇథైల్ ఆల్కహాల్ అని పేర్కొని మిథనాల్ లేదా మిథైల్ ఆల్కహాల్ ను వాడుతుండటం గమనార్హం.