ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలు చాలా భయబ్రాంతులకు లోనవుతున్నారు.ఈ మహమ్మారి ఎప్పుడు ఎక్కడి నుండి వస్తుందో అని అందరూ భయంతో వణికిపోతున్నారు.
అయితే కొందరు మాత్రం ఈ భయాన్నే క్యాష్ చేసుకుని తప్పుడు ప్రచారంతో ప్రజల్లో మరింత భయాన్ని క్రియేట్ చేస్తున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రకమైన వార్తలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి.
తాజాగా కరోనా కష్టసమయంలో ప్రజలందరూ హ్యాండ్ శానిటైజర్లు వాడాల్సిందిగా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోన్న సంగతి తెలిసిందే.అయితే కొందరు మాత్రం ఈ విషయంపై అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు.
వరుసగా 50 నుండి 60 రోజులు శానిటైజర్లు వాడితే క్యాన్సర్ వ్యాధి సోకుతుందనే వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.దీంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
అసలే వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అర్ధంగాక ఉంటే, ఇప్పుడు ఇలా శానిటైజర్లు వాడితే క్యాన్సర్ వస్తుందనే వార్తతో వారు తలపట్టుకుంటున్నారు.
ఈ విషయంపై ఢిల్లీ సర్కార్ తాజాగా ఓ ప్రకటన చేసింది.
శానిటైజర్ వాడినంత మాత్రాన క్యాన్సర్ వస్తుందనే వార్తలో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వం తేల్చేసింది.శానిటైజర్లలో 70 శాతం ఆల్కాహాల్ ఉంటుందని, అందుచేత క్యాన్సర్ రాదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
కాగా ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.