దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.వైరస్ వ్యాప్తి వల్ల మాస్క్, శానిటైజర్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది.
అయితే శానిటైజర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుండి చెబుతునే ఉన్నారు.తాజాగా శానిటైజర్ ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది.
శానిటైజర్ బాటిల్ పేలడంతో మహిళ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి.అమెరికాలోని టెక్సాస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొన్ని రోజుల క్రితమే ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.టెక్సాస్కు చెందిన కేట్ వైడ్ అనే మహిళ కరోనా వైరస్ సోకకుండా ప్రతిరోజూ శానిటైజర్ రాసుకునేది.
ప్రతిరోజూ రాసుకున్న విధంగానే ఆదివారం రోజున కూడా శానిటైజర్ రాసుకుంది.అదే సమయంలో ఇంట్లో కొవ్వొత్తి వెలిగించాల్సి రావడంతో కేట్ అగ్గిపెట్టె తీసుకుని కొవ్వొత్తి వెలిగించడానికి ప్రయత్నించింది.
అయితే ఊహించని విధంగా ఆమె చేతికి మంటలు అంటుకున్నాయి.
ఊహించని ఈ ఘటనతో మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
భయంతో ఆమె వెంటనే వెనక్కు దూకగా మంటలు శానిటైజర్ బాటిల్ కు అంటుకుని బాటిల్ బాంబ్ లా పేలింది.ఈ ఘటనలో ముఖానికి ఎక్కువగా గాయాలు కాగా కాళ్లు, చేతులకు సైతం కొద్దిగా గాయాలు అయ్యాయి.
కేట్ కూతుళ్లు ఘటన జరిగిన వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు.వైద్యులు ఆమెను పరీక్షించి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని తేల్చారు.
వైద్య నిపుణులు శానిటైజర్ వాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.