తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటికాలు మీద లేస్తాడు.అసలు తెలంగాణాలో ఆ పార్టీ ఉనికే లేకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకుని తెలంగాణ టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ టీఆర్ఎస్ పార్టీ లో చేర్చేసుకుని వారికి కీలక పదవులు కూడా ఇచ్చేసాడు.
ఇక అక్కడ పార్టీ పూర్తిగా కనుమరుగయిపోయింది అనుకుంటున్న సమయంలో తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడం… ఎవరూ ఉహించని విధంగా మహాకూటమి ఏర్పాటు అవ్వడం… టీడీపీ మళ్ళీ తన ఉనికి చాటుకుని రెండు సీట్లు గెలుచుకోవడం జరిగిపోయింది.అయితే ఈ పరిణామాలు అస్సలు ఊహించని కేసీఆర్ ఎలా అయినా అసెంబ్లీ లో టీడీపీకి స్థానం లేకుండా చేయాలని చూస్తున్నాడు.
దీనిలో భాగంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి … సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్యెల్యే మచ్చా నాగేశ్వరావు ను కారెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరే విషయంలో అనేక ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి.ముఖ్యంగా సండ్ర కారెక్కేందుకు సిద్ధం అయినా… మచ్చా నాగేశ్వరావు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు.ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే వీరు కారెక్కే సమయం దగ్గరకు వచ్చేసినట్టు అర్ధం అవుతోంది.
సండ్రకు టీటీడీ పాలక మండలి సభ్యత్వాన్ని ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.అయితే ఆయన నెల రోజులలోపే సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉన్నా… ఆయన మాత్రం స్పందించలేదు.
టీటీడీ సభ్యత్వం తీసుకుంటారా లేదా అనేది కూడా ఆయన ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో ఆయన సభ్యత్వాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.నిబంధనల ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు కూడా ప్రకటించారు.దీంతో, ఆయనకి పార్టీ మారేందుకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయ్యింది.
టీఆర్ఎస్ చేరేందుకు సొంత పార్టీ టీడీపీ నుంచి కూడా ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ రేగుతోంది.రేపో మాపో విస్తరణ ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్యెల్యేలు ఇద్దరినీ పార్టీలో చేర్చేసుకోవాలని చూస్తున్నారు.ఎందుకంటే… సండ్ర కు మంత్రి పదవి హామీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది.అందుకే ఆ విస్తరణకు ముందుగానే ఈ ఇద్దరినీ చేర్చేసుకుని టీడీపీకి తెలంగాణాలో ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు.
కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా… అశ్వారావుపేట ఎమ్యెల్యే మచ్చా నాగేశ్వరావు విషయంలో క్లారిటీ లేకుండా పోవడమే.ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తే … ఈ ఉత్కంఠకు తెరపడినట్టే.