భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారు అందరూ ఎంతో గర్విచదగ్గ విషయం అమెరికాలో సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం కీర్తి శిఖరాలు అందుకోవడం.భారత సంస్కృతీ, సాంప్రదాయాలు, కళలను అగ్ర రాజ్యంలో భారత సంతతికి నేర్పడంతో పాటు, పలు భారత బాషలను నేర్పించడంలో సిలికానాంధ్రా కీలక పాత్ర పోషిస్తోంది.2016 లో అమెరికాలో స్థాపించబడిన సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల సరసన నిలుస్తోంది.ఈ క్రమంలోనే శాన్ వాకిన్ డిస్ట్రిక్ట్ పరిధిలోని ట్రేసీ నగరంలో భారతీయులు అందరూ గర్వించేలా, తెలుగు జాతి మొత్తం ఆనందించేలా దాదాపు 67 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి యూనివర్సిటీని స్థాపించేందుకు నడుంబిగించింది.
సిలికానాంధ్రా తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ కు దాదాపు 67 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వడానికి ఎన్నారై ఫ్యామిలీ అయిన సందు కుటుంభం ముందుకు వచ్చింది.సిలికాన్ వ్యాలీ కి సమీపంలో ప్రధాన రహదారి పక్కనే ఎంతో అద్భుతమైన రీతిలో రూపు దిద్దుకోవడానికి సిద్దంగా ఉంది.
ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎంతో మంది యువతకు స్పూర్తిగా ఉండాలని, భారతీయ కళలపై చెరగని ముద్ర వేయాలని, ప్రతీ ఒక్క భారతీయ కుటుంభంలోని యువత ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో లాభాలు పొందాలని తాము ఈ భూమిని విరాళంగా ఇచ్చినట్టుగా సందు మైక్, సందు మణి లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్రా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ భారతీయ కళలను ప్రపంచానికి తెలియజేస్తూ, ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి ఈ విశ్వవిద్యాలయం స్పూర్తిగా నిలవాలని, ఈ విశ్వవిద్యాలయం ద్వారా భారతీయ కళా సంపద విస్తరించడమే తమ ధ్యేయమని ప్రకటించారు.5 ఏళ్ళలో ఈ నూతన విశ్వవిద్యాలయం నిర్మాణంలో సగభాగమైన పూర్తి చేయాలని సంకల్పించామని, ఈ విశ్వవిద్యాలయం నిర్మాణానికి మొత్తం రూ.3300 కోట్లు ఖర్చు అవుతుందని, దాతల సహకారంతో ఈ నిర్మాణం పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా అమెరికాలో సిలికానాంధ్రా రూపుదిద్దుకుంటుందని, అందుకోసం ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆయుర్వేద, యోగా, సంగీతం, నృత్య మరియు వీటిలో phd కోర్సులు చేసేలా రూపొందిస్తున్నామని తెలిపారు.మరిన్ని వివరాలకోసం https://www.uofsa.edu/ వెబ్సైటు ను అనుసరించవచ్చునని కూచిభొట్ల తెలిపారు.