మనిషికి అనేక కోరికలు ఉంటాయి.కాని ఏవి కోరుకోవాలి…ఏవి కోరుకోకూడదు అనేది తెలియాలి.
ఏవి నెరవేరుతాయో, ఏవి నెరవేరవో అవగాహన ఉండాలి.రాజకీయ నాయకులకు ఈ అవగాహన మరింత ఎక్కువగా ఉండాలి.
మనసులో ఏదుంటే అది అధినేతకు చెప్పకూడదు.రాజకీయాలు ప్రజల సెంటిమెంట్లతో, వారి భావోద్వేగాలతో సంబంధించినవి కాబట్టి కోరికలు జాగ్రత్తగా కోరాలి.
నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఒకాయన అధినేత ములాయం సింగ్ను కోరరాని కోరి, ఈయనకు కోపం తెప్పించి పార్టీ నుంచి సస్పెండయ్యాడు.
ఆ నాయకుడి పేరు మహమ్మద్ ఫారూక్ ఘోసీ.పార్టీ మహారాష్ర్ట యూనిట్ ఉపాధ్యక్షుడు.
ఈయనకు ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్ భార్య మీద జాలి కలిగింది.భర్త పోయిన భార్యగా ఆమెపై జాలి పడ్డాడో, ఒకే మతానికి చెందిన వ్యక్తి కాబట్టి జాలి పడ్డాడో తెలియదు.
ఆమెకు సహాయం చేయాలనుకున్నాడు.ఉద్దేశం మంచిదే కావొచ్చుగాని అది పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా మారే అవకాశముంది.
మెమన్ ఉగ్రవాది అని తెలిసి కూడా ఆయన భార్యకు ఎస్పి తరపున రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చి పార్లమెంటుకు పంపాలంటూ ములాయం సింగ్ యాదవ్కు ఘోసీ లేఖ రాశాడు.ఈ విషయం తెలిసిన వెంటనే భాజపా, కాంగ్రెసు, శివసేన మండిపడ్డాయి.
యాకూబ్ భార్య రహీన్ నిస్సమాయ స్థితిలో ఉందని, కాబట్టి ఆమెకు సహాయం చేయాలని ఘోసీ కోరాడు.ఈమె ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న నేరం మీద చాలా ఏళ్లు జైల్లో ఉంది.
మన పార్టీ ముస్లింల తరపున పోరాడుతోంది కాబట్టి రాజ్యసభకు పంపడం సమంజసమని ఘోసీ అభిప్రాయపడ్డాడు.తన మనసులో ఉన్న మాట చెప్పానన్నాడు.
ఎస్పి ముస్లింల తరపున పోరాడే మాట నిజమే అయినా ఉగ్రవాది భార్యకు రాజ్యసభ టిక్కెట్టు ఇస్తే జనం ఊరుకుంటారా? రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు కలగవా? అందుకే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.