సకాలంలో అందని న్యాయం న్యాయమే కాదంటారు.ఇది మన దేశంలో చాలామందికి అనుభవమే.
కోర్టులో కేసు పూర్తయి నిందితులకు శిక్షలు పడేసరికి ఓ జీవితకాలం పడుతుంది.కొన్ని కేసుల్లో నిందితులు చనిపోతారు.
కొన్ని కేసుల్లో సాక్షులు మరణిస్తారు.బాధితులకు మాత్రం న్యాయం జరగదు.
కింది కోర్టులు శిక్షలు వేస్తే నిందితులు హైకోర్టుకు పోతారు.అక్కడా తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీం కోర్టుకు వెళతారు.
ఇన్ని కోర్టుల్లో విచారణ జరిగేసరికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది.ఈ కాలమంతా నిందితులు బెయిల్ మీద ఉండి తమ పనులు తాము చేసుకుంటారు.
హిట్ అండ్ రన్ కేసులో (మద్యం మత్తులో కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణం కావడం) బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ విషయంలోనూ ఇదే జరిగింది.ఈ కేసులో పదమూడేళ్ల విచారణ తరువాత ముంబయిలోని ఓ కోర్టు సల్మాన్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది.ఇంకేం సల్మాన్ జైలుకెళ్లిపోతాడని, అక్కడ చిప్ప కూడు తింటాడని సామాన్యులు అనుకుంటారు.
కాని అతను జైలుకు పోవడంలేదు.ముంబయి హైకోర్టు ఈ శిక్షను తాత్కలికంగా నిలిపేసింది.
అంటే సస్పెండ్ చేసింది.ఎందుకంటే సల్మాన్ కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
హైకోర్టు మళ్లీ విచారించి సల్మాన్ను దోషిగానో, నిర్దోషిగానో నిర్ధారించాలి.అప్పటివరకు ఆయన బెయిల్ మీదనే ఉంటాడు.
కింది కోర్టులోనే విచారణకు పదమూడేళ్లు పడితే హైకోర్టులో ఎన్నేళ్లు పడుతుందో.కింది కోర్టు తీర్పును రివ్యూ చేయడమే కదా అని చాలామంది అనుకుంటారు.
కాని మన న్యాయస్థానాల్లో కేసులు అంత తొందరగా తెమలవు.సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసులోనూ కొన్నేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.ఇక ఆ కేసు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.