మట్టిపై ప్రయోగాలు చేసి ఆహారోత్పత్తికి కృషి చేసినందుకు గాను ఇండో అమెరికన్ శాస్త్రవేత్త రత్తన్లాల్ (75)ను ప్రతిష్టాత్మక వరల్డ్ పుడ్ ప్రైజ్ వరించింది.2020 సంవత్సరానికి గాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రకటించింది.ఈ అవార్డు కింద రూ.1.90 కోట్లను రత్తన్లాల్ అందుకోనున్నారు.
ఐదు దశాబ్థాలుగా నాలుగు ఖండాల్లో భూసార పరిరక్షణకు, 50 కోట్ల మంది రైతుల జీవనోపాధిని పెంచేందుకు గాను రత్తన్ కృషి చేశారు.
ఈ క్రమంలో సమారు 200 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రతను కల్పించారు.రత్తన్లాల్ సూచించిన విధానం ద్వారా కొన్ని వందల మిలియన్ల హెక్టార్లలో సహజ ఉష్ణ మండల పర్యావరణ వ్యవస్ధలను కాపాడారని పలువురు ప్రశంసించారు.రత్తన్లాల్ ఓహియో యూనివర్సిటీలో కార్బన్ మేనేజ్మెంట్ అండ్ సీక్వెస్ట్రేషన్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్గా, సాయిల్ సైన్స్ ప్రొఫెసర్ గానూ పనిచేస్తున్నారు.2007లో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) నోబెల్ శాంతి బహుమతిని పొందడంలో రత్తన్ లాల్ కీలక పాత్ర పోషించారు.
నైజీరియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్లో రత్తన్ తన పరిశోధనా జీవితాన్ని ప్రారంభించారు.ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో నేల ఆరోగ్య పునరుద్ధరణ ప్రాజెక్టులను అభివృద్ధి పరిచారు.నో టిలేజ్, కవర్ క్రాపింగ్, మల్చింగ్, అగ్రోఫారెస్ట్రీ వంటి కొత్త పద్ధతులను రత్తన్ లాల్ అన్వేషించారు.ఆయన సూచించిన పద్ధతులు వ్యవసాయ, పర్యావరణ వ్యవస్ధల యొక్క ధీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరిచింది.
అంతేకాకుండా కరువు, వరదలు, వాతావరణ మార్పుల వంటి ప్రభావాల నుంచి రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను తగ్గించింది.