ఎలాంటి వ్యాధికైనా చికిత్స చేయాలంటే ముందు దానిని గుర్తించాలి.మానవాళికి సవాల్ విసిరిన మహమ్మారులన్నింటిని గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్లే అవి కోట్లాది మందిని బలి తీసుకున్నాయి.
వైద్య రంగం అభివృద్ధి చెందడం, ఎంతోమంది మహనీయుల నిర్విరామ కృషి ఫలితంగా టెస్టింగ్, డయాగ్నోసిస్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.చిన్న పరీక్ష చేసి ఏ వ్యాధి సోకిందో, ఏ భాగంలో వుందో, ప్రస్తుతం దాని కదలిక ఏంటి అన్న దానిని తెలుసుకుని.
అందుకు తగిన విధంగా చికిత్స చేస్తున్నారు వైద్యులు.
ఇక ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విషయానికి వస్తే.
దీనిని గుర్తించడానికి తొలుత ఏ దేశంలో కూడా సామాగ్రి లేదు.అందుబాటులో వున్న సిటీ స్కాన్ ద్వారానే వైరస్ను నిర్ధారించారు.
అయితే తర్వాతి కాలంలో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి.భారతదేశం సైతం ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
మొదటి దశ కాలంలో దేశంలోని ప్రతి రాష్ట్రంలోని అనుమానితుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపి కోవిడ్ సోకింది లేనిది తెలుసుకున్నారు.దీనికి 48 గంటల సమయం పట్టేది.
ఆ లోగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందేది.తర్వాతి కాలంలో చైనా, దక్షిణ కొరియాల నుంచి మనదేశం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకుంది.
అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ సామర్ద్యాన్ని సైతం ఇండియా మరింత అభివృద్ధి చేసుకుంది.ప్రస్తుతం మారుమూల పల్లెల్లో సైతం కరోనా నిర్ధారణా పరీక్షలు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం అందుబాటులో వున్న స్వాబ్ టెస్టులో కొన్ని ప్రతిబంధకాలు వున్నాయి.కరోనా పరీక్ష కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.అయితే వీటిని సేకరించే ఆరోగ్య కార్యకర్తలకు ఈ విధానం వల్ల కరోనా ముప్పు సోకే ప్రమాదం ఉంది.అలాగే స్వాబ్ టెస్ట్ సమయంలో పలువురి ముక్కుల్లో స్వాబ్ స్టిక్ ఇరుక్కుపోయిన దాఖలు వున్నాయి.
దీని వల్ల కోవిడ్ సంగతి ఏమో కానీ బాధితుడి నరకయాతన వర్ణనాతీతం.ఇలాంటి వాటికి చెక్ పెడుతూ.లాలాజలం ద్వారా కరోనాను నిర్ధారించే విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
లాలాజల నమూనాలను సేకరించడం చాలా సులువు.ఇందులో శ్లేష్మం, రక్తం కలిసి ఉండే అవకాశాలు వున్నాయి.కానీ లాలాజల విశ్లేషణ వల్ల ఫలితాల్లో కచ్చితత్వం తక్కువగా ఉంటుందని ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలింది.
అయితే లాలాజలం విధానంలోని ప్రతిబంధకాలను తొలగించి కచ్చితమైన ఫలితాన్ని రాబట్టే విధానాన్ని అమెరికాలోని ఆగస్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.ఈ పరిశోధన బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రవీంద్ర కొల్హె నేతృత్వం వహించారు.
వీరు రూపొందించిన విధానంలో లాలాజల నమూనాలను ఆర్టీ-పీసీఆర్ పరీక్షకు పంపడానికి ముందు ‘ఓమ్ని బీడ్ మిల్ హోమోజెనైజర్’ ద్వారా ప్రాసెస్ చేయాలి.లాలాజలాన్ని ఆర్టీ-పీసీఆర్తో పరీక్షకు గురిచేసినప్పుడు తక్కువ సున్నితత్వాన్ని కలిగి ఉండటానికి కారణం.
ఆ నమూనా ఒక జెల్లా చిక్కగా ఉండటమే.దీనివల్ల నమూనాను ఎక్స్ట్రాక్షన్ ప్లేట్లలోకి కచ్చితత్వంతో బట్వాడా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
హోమోజెనైజర్ ద్వారా ప్రాసెస్ చేయడం వల్ల ఈ అడ్డంకిని అధిగమించొచ్చు.దీనివల్ల నమూనా బట్వాడా సాఫీగా సాగుతుందని పరిశోధకులు తెలిపారు.