ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి యామిని సాధినేనికి అరుదైన గౌరవం దక్కింది.అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామికవేత్తల సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఆమె నియమితులయ్యారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (సీఐఎంఎస్ఎంఈ), సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (సీఈఐఐఈ)లకు గౌరవాధ్యక్షురాలిగా ఎంపికైనట్లు యామిని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ సంఘం పంపిన లేఖను ఆమె తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
4,700 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తల జాతీయ వ్యాపార నెట్వర్క్, యువ పారిశ్రామిక వేత్తల బృందంతో ఏర్పాటైన ఈ సంస్థ యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది.అలాగే భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది.
తనను ఈ పదవిలో నియమించడం పట్ల యామిని స్పందించారు.ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ప్రత్యర్ధుల విమర్శలను తిప్పికొట్టిన యామిని సాధినేని అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం తర్వాత ఆమె గతేడాది నవంబర్లో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.