రాజస్థాన్ లో ఇటీవల రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గెహ్లాట్,డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య విభేదాల కారణంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
సొంత పార్టీ పైనే తిరుగుబావుట ఎగురవేస్తూ సచిన్ 30 మంది ఎమ్మెల్యేల బలం ఉందంటూ బయటకు వచ్చేశారు.దీనితో పార్టీ విప్ జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తుండడం తో కాంగ్రెస్ పార్టీ సచిన్ పై తాజాగా వేటు కూడా వేసింది.
అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సచిన్ కాషాయ కండువా కప్పుకుంటారు అంటూ ప్రచారం కూడా జరిగింది.అయితే తాజాగా ఈ వార్తలపై పైలట్ స్పందించారు.
తాను ఎలాంటి కాషాయ కండువా కప్పుకోవడం లేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ స్పష్టం చేశారు.ఇటీవల పైలట్ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను కలవనున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఆయన త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు అంటూ అందరూ భావించగా దానిపై తాజాగా స్పష్టత ఇచ్చారు.అయితే సచిన్ సొంత పార్టీ పెట్టె యోచనలో ఉన్నట్లు సమాచారం.
మరోపక్క సచిన్ తో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న మరో 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కానందున్న వల్ల అనర్హత వేటు వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్కు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు కూడా సచిన్ టీమ్లో చేరినట్లు తెలుస్తుంది.
అలానే యువనేత సచిన్ పైలట్ను బహిష్కరించిన కొన్ని గంటలకే ఆయనకు మద్దతు పలికిన మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత సంజయ్ ఝాను కూడా పార్టీ బహిష్కరించినట్లు తెలుస్తుంది.
పార్టీ కోసం సచిన్ తన రక్తాన్ని ధారపోశారని, ఆయనపై వేటు సరికాదంటూ పార్టీ నిర్ణయాన్ని ఝా తప్పుబట్టడం తో ఆయనపై కూడా వేటు తప్పలేదు.ఆయన ఇలా సొంత పార్టీ పై విమర్శలకు దిగడం ఇదే తొలిసారి ఏమీ కాదు గతంలో కూడా పలుమార్లు సొంత పార్టీ లో బోలెడు లోపాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.