టిఆర్ఎస్ పార్టీలో ఇంటి పోరు రోజు రోజుకి తీవ్రమవుతోంది.ఇప్పటివరకు కెసిఆర్ అంటే భయం భక్తులతో ఉండే పార్టీ నాయకులంతా ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టుగా వర్గ పోరు తో అధినేతకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు.
కెసిఆర్ కూడా గతంలో ఉన్నంత కఠినంగా క్రమశిక్షణ విషయంలో ఉండలేకపోతున్నారు ఇదే అలుసుగా తీసుకుని నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీ పుట్టి ముంచే కార్యక్రమానికి తెరతీశారు.ప్రతి జిల్లాలోనూ వర్గ పోరు, గ్రూపు తగాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు వర్గం ప్రత్యేకంగా సమావేశం అవ్వడం, స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకోవడం, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పై అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగాయి.
అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇదే వర్గపోరు తో సతమతం అవుతున్నారు.ఆమెకు మంత్రి పదవి ఉన్నా స్థానిక పార్టీ నాయకుల నుంచి సరైన సహకారం అందడం లేదట.తాండూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి మంత్రి సబితా హాజరు కాగా, దానికి నిరసనగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వర్గం ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యింది.
సబిత కార్యక్రమానికి టీఆర్ఎస్ శ్రేణులు ఎవరు హాజరు కాకపోవడం, కాంగ్రెస్ నుంచి ఆమెతో పాటు టిఆర్ఎస్ లో చేరిన వారు మాత్రమే ఆమె వెంట ఉన్నారట.ఇక గద్వాల్ జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి వర్గాలు ఇదే విధమైన వర్గ పోరుతో సతమతం అవుతున్నాయి.
గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మీద అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తీవ్రమైన విమర్శలు చేస్తూ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.ఆయన వెనుక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారని, ఆయన అండతోనే అబ్రహం రెచ్చిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి వర్గం అసంతృప్తిగా ఉంది.
తమ వర్గాన్ని ఎమ్మెల్యే హర్షవర్ధన్ చిన్నాభిన్నం చేస్తున్నారని జూపల్లి ఆరోపిస్తున్నారు.ఇలా చూసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని అసంతృప్తి ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యింది.ప్రస్తుతం కేసీఆర్ అనేక విషయాల్లో తీరిక లేకుండా ఉండడం, ఆర్టీసీ సమ్మె తదితర విషయాలు తలబొప్పి కట్టిస్తుండడంతో పార్టీ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా ఉండలేకపోతున్నారు.
ఇదే అదునుగా ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలు నెలకొని టిఆర్ఎస్ కు ఇబ్బంది పరిణామాలు తెచ్చిపెడుతున్నాయి.