తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయిందని చె ప్పవచ్చు.ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా సత్తా చాటని కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో కూడా ఘోరంగా విఫలమవుతూ ఏ మాత్రం పోరాట పటిమ చూపకుండానే ఓడి పోతూ వస్తోంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా ఏ మాత్రం పోరాటం చేయకుండా ప్రెస్ మీట్లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలు అంతర్గత పోరు అన్నది కాంగ్రెస్ ను గత దశాబ్ధ కాలంగా దెబ్బ తీస్తూ వస్తోంది.వ్యక్తిగత స్వార్థానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పేరును ప్రజల్లో పెంచడానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.
అయితే పీసీసీ చీఫ్ మార్పుతోనైనా కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని ఆశించినా రకరకాల ట్విస్ట్ ల తర్వాత పీసీసీ చీఫ్ ఎంపికను వాయిదా వేసిన పరిస్థితి ఉంది.ఇప్పటివరకు పీసీసీ చీఫ్ ఎంపికపై మరల ఎటువంటి వార్తలు వినిపించకున్నా తాజాగా మరల పీసీసీ చీఫ్ ఎంపికపై వార్తలు మొదలవుతున్నాయి.
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దాదాపు ఖరారయినట్లు, ఇక అధికారిక ప్రకటనే తరువాయి అన్నట్లుగా మీడియాలో, రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది.ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
లేక మరల కాంగ్రెస్ పై ప్రజలు దృష్టి సారించేలా కాంగ్రెస్ వేసిన వ్యూహంలో భాగమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.