అగ్రరాజ్యం అమెరికా కరోనా ధాటికి అల్లాడిపోతోంది.ఒకే రోజు ఇక్కడ 1,400 పైచీలుకు ప్రజలు మరణించారు.
అయితే వైరస్ నిర్థారణ పరీక్షలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల రోగుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వైరికి చికిత్స అందించేందుకు తగినంత మంది వైద్య సిబ్బంది అందుబాటులో లేరు.
ఈ నేపథ్యంలో భారత సంతతి వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు చేయడానికి ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వాలు సడలించాయి.
విదేశాల్లో జన్మించిన, విదేశాల్లో లైసెన్స్ పొందిన వైద్యులకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ, న్యూయార్క్ గవర్నర్ ఆండ్యూ క్యూమో సంతకాలు చేశారు.
నిబంధనల సడలింపు ద్వారా జే 1, హెచ్1 బీ వీసాదారులుగా ఉన్న దాదాపు 1,000 మంది భారతీయ వైద్యులు కరోనా వైరస్పై పోరాటం చేయడానికి వీలు కలుగుతుంది.
కరోనా తీవ్రతను అమెరికా ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందని, ఫలితంగా వైరస్ వ్యాప్తిని నిలువరించడం కష్టంగా మారిందని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా (ఏఏపీఐ) అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు,.సుమారు లక్షమంది వైద్యులు సభ్యులుగా గల ఈ సంఘం అమెరికా కరోనా నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.అమెరికా వ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో భారతీయ వైద్యులు క్రియా శీలక పాత్ర పోషిస్తున్నారు.
న్యూయార్క్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో వైద్యుల కొరత అధికంగా ఉంది.అమెరికాలో ఇప్పటి వరకు 2,77,522 మందికి కరోనా సోకగా.7,403 మంది మరణించారు.