తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ, అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పై అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇది తీరని సమస్యగా మారిపోయింది.ఆఖరికి ఈ విషయంలో హైకోర్టు కూడా కలుగజేసుకోవాల్సి వచ్చింది.
తాజాగా సమ్మె విషయంలో ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది.కార్మికులను బేషరతు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ తరఫున ఓ ప్రకటన విడుదల చేసింది.
బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, థామస్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
సమ్మె విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.హైకోర్టు తీర్పు సమ్మె కొనసాగింపుపై అనేక చర్చలు జరిపారు.
అనంతరం జేఏసీ నాయకులు మీడియా ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
లేబర్ కోర్టులో కార్మికులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.వెంటనే ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి అని కోరారు.