తెలంగాణాలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పటివరకు తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే శాసనం, మాట్లాడిందే వేదం అన్నట్టుగా వ్యవహారాలు నడిపించారు.అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతూ వచ్చాయి.
కేసీఆర్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతుండడం ఆ పార్టీకి మచ్చ తీసుకొస్తున్నాయి.పార్టీ ఆవిర్భావం నుంచి తన వెన్నంటే ఉంటూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చిన హరీష్ రావు ను పక్కన పెట్టెయ్యడం పై పెద్ద ఎత్తున విమర్శలు కేసీఆర్ మీద వచ్చాయి.
అది రోజు రోజుకి తీవ్ర తరం అవుతూ మరింత నష్టం చేకూర్చే విషయంగా మారడంతో చిక్కుల్లో పడిన కేసీఆర్ వెంటనే హరీష్ ను తన మంత్రివర్గంలోకి తీసుకుని తగిన ప్రాధాన్యత ఇచ్చాడు.ఇక అవన్నీ సర్దుమణిగాయనుకుంటున్న సాయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె టీఆర్ఎస్ పరువుని బజారున పడేశాయి.
ప్రస్తుతం హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల సందడి జోరు మీద ఉంది.అన్ని పార్టీలు ఇక్కడ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అన్ని పార్టీల సంగతి ఎలా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా ప్రతిష్టాత్మకం.అంతే కాదు టీఆర్ఎస్ పరిపాలన తీరుకి ఇది కొలమానం కూడా కాబోతోంది.ఈ నేపథ్యంలోనే ఇక్కడ గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం, దాన్ని కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా అణిచివేసేందుకు ప్రయత్నించడంతో వివాదం మొదలయ్యింది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.సమ్మెకు దిగిన కార్మికులందరినీ విధుల నుంచి తొలగించడంతో సమ్మె మరింత ఉదృతం అయ్యింది.
దీని ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడేలా కనిపిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టకముందు వరకు ఇక్కడ విజయంపై టీఆర్ఎస్ ధీమాగానే ఉంది.విజయం తమకే సొంతం అన్నట్టుగా వ్యవహరించింది.అయితే ఎపుడయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారో అప్పడే పరిణామాలన్నీ శరవేగంగా మారిపోయాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వబోతున్న సిపిఐ కూడా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ పార్టీకి సమస్యగా మారింది.హుజూర్ నగర్లో సిపిఐ కు పెద్దగా సంఖ్యా బలం లేదు.
కానీ, కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.అంతే కాదు ఇప్పుడు అక్కడ ప్రతి ఓటు కీలకం కాబోతోంది.
కానీ సీపీఐ మద్దతు ఉపసంహరించుకోకపోవడంతో ఆ పరిణామాలన్నీ టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయి.అంతిమంగా టీఆర్ఎస్ పార్టీకి హుజూర్ నగర్ లో షాక్ తప్పేలా కనిపించడంలేదు.