తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసినా వారిని ప్రభుత్వం ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడంతో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లే బస్సులు నడుపుతున్నారు.వీరి ప్రవర్తనతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే కొందరు తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యానికి పలు యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందే.కాగా టికెట్ ఇవ్వాల్సిన కండక్టర్ ఇష్టారీతిలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాదనలు వినిపించాయి.
తాజాగా కామారెడ్డి డిపోకు చెందిన బస్సులో ఓ తాత్కాలిక కండక్టర్ తన బంధువులు ప్రయాణిస్తున్నారని వారికి టికెట్ కొట్టలేదు.దీంతో ప్రయాణికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసి వారికి టికెట్ ఎందుకు కొట్టలేదని కాస్త గట్టిగానే నిలదీశారు.
వారు తన బంధువులని, అందుకే టికెట్ కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రబుద్ధుడు.ఈ బస్సు నీ సొంతం కాదని బస్సులో ప్రయాణికులు మండిపడటంతో దెబ్బకు జడుసుకున్నాడు సదరు కండక్టర్.
చేసేది ఏమీ లేక తన బంధువులకు కూడా టికెట్ కొట్టాడు.
ఈ ఘటనపై ప్రయాణికులు సంబంధిత డిపో మేనేజర్కు ఫిర్యాదు కూడా చేశారు.
తాత్కాలిక సిబ్బంది వల్ల ఆర్టీసీకి నష్టం ఎక్కువవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.మరి తాజాగా జరిగిన ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.