జనసేన పార్టీలో ఓటమి బాధ ఎక్కువగా కనిపిస్తోంది.ఎంతో చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేవలం ఒక్కటంటే ఒక్క సీటు దక్కడం ఇప్పటికీ అధినేత పవన్ తో పార్టీ పార్టీ నేతలు ఎవరికీ మింగుడుపడడంలేదు.
అందుకే అసలు మనం ఎందుకు ఓడిపోయాం అనే విషయాన్ని తెలుసుకునేందుకు జిల్లాల వారీగా సమీక్షలను తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా అనేక అంశాలను గురించి ఇక్కడ చర్చించుకుంటున్నారు.
ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకి ఓటములు సహజమేనని, దెబ్బ తినే కొద్ది తానూ ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తిని కాదంటూ ఆవేశంగా ప్రసంగించారు.
తాను ఈ ఒక్క ఎన్నికలు చూసి భయపడనని, 25 సంవత్సరాల లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
తనకి ఓటమి ఎదురైతే తట్టుకోగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్న తరువాత మాత్రమే జనసేన పార్టీని తాను స్థాపించానన్నారు.ఈవీఎంల అక్రమాలు, ధన ప్రవాహం వంటివి జనసేన ఓటమికి కారణాలుగా చెబుతున్నారని కానీ నేను వీటన్నింటినీ పట్టించుకోవడంలేదన్నారు.కానీ ఖచ్చితంగా ఒక్కటి చెప్పగలను అంటూ శాసనసభ ఎన్నికల్లో భీమవరంలో తనను ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారని తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనేదే దాని వెనుక లక్ష్యమని పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.
నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తానని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.ప్రజలు ఇచ్చిన తీర్పుని జనసేన అంగీకరిస్తుందని వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూద్దామని అన్నారు.ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన పార్టీ అందరికి గుర్తుకురావాలన్నారు.నా జీవితం రాజకీయాలకు, ప్రజాసేవకే అంకితమన్నారు.
ఈ సందర్భంగా సమీక్షలకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు ఉంటారా వెళ్లిపోతారా అని ప్రశ్నించారు.మీ వెంటే మేము ఉంటామని వారు చెప్పగా ఇంతకు మించిన విజయం ఏం కావాలి అంటూ పవన్ ఆనందం వ్యక్తం చేశారు.