ఎంకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో స్థానికులకు లేనిపోని కష్టాలను ఎదుర్కొంటున్నారు.
భారత పర్యటనలో భాగంగా ట్రంప్ న్యూఢిల్లీతో పాటు అహ్మదాబాద్, గాంధీనగర్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో అహ్మదాబాద్, గాంధీనగర్లలో ని స్టార్ హోటళ్లలో గదుల అద్దెలు ఒక్కసారిగా 30 నుంచి 50 శాతం పెరిగాయి.
ఎన్ఆర్ఐ సీజన్ కారణంగా జంట నగరాల్లోని లగ్జరీ హోటళ్లు ఇప్పటికే అధిక ఆక్యుపెన్సీని చూపిస్తున్నాయని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ అధ్యక్షుడు నరేంద్ర సోమానీ తెలిపారు.24వ తేదీని ట్రంప్-మోడీ కార్యక్రమం ఉండటంతో ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతర అగ్రనేతల కోసం గదులను ముందుగానే బుక్ చేస్తున్నట్లు సోమానీ వెల్లడించారు.ఈ నేపథ్యంలో గదుల లభ్యత పరిమితంగా ఉన్నందున వీపరితమైన డిమాండ్ ఉందని, అందువల్ల టారిఫ్లు పెరుగుతాయని నరేంద్ర తెలిపారు.
గతంలో వైబ్రంట్ గుజరాత్ సదస్సు కోసం లగ్జరీ హోటళ్లలోని సూట్ రూమ్లను రోజుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించి బుక్ చేసుకున్నారని మరో అధికారి తెలిపారు.రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు అందుబాటులో ఉన్న గదుల ధరలు ఇప్పుడు రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెరిగాయి.అహ్మదాబాద్, గాంధీనగర్లలో సగటున ఆక్యుపెన్సీ రేటు 55-60 శాతం మధ్య ఉంటుంది.
అయితే డిసెంబర్ నుంచి మార్చి మధ్య వరకు ఎన్ఆర్ఐ సీజన్ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 80-85 శాతం వరకు పెరుగుతుందని హెచ్ఆర్ఏజీ ఛైర్మన్ తులసి టెక్వానీ చెప్పారు.అదే సమయంలో ఈ ఏడాది ట్రంప్-మోడీ మెగా ఈవెంట్ ఉన్నందున గదుల టారిఫ్ మరింతగా పెరిగాయన్నారు.
ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే సీనియర్ అధికారుల కోసం పెద్ద సంఖ్యలో గదులను బుక్ చేస్తున్నట్లు గుజరాత్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వర్గాలు ధ్రువీకరించాయి.ఇప్పటికే ట్రంప్, మోడీ భద్రతా సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వం గదులు బుక్ చేసింది.