లగడపాటి రాజగోపాల్ ! ఈ పేరుకంటే ఆంధ్రా ఆక్టోపస్ అంటేనే అందరికి బాగా అర్ధం అవుతుంది.లగడపాటి రాజగోపాల్ ఎప్పుడూ రాజకీయ సంచలనం సృష్టిస్తూనే ఉంటారు.
ఏపీ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తన సర్వే రిపోర్ట్స్ తో హడావుడి చేయడం, రాజకీయ సంచలనం సృష్టించడం లగడపాటి స్టైల్.అసలు ఎన్నికల సర్వేలు పేరు చెప్తేనే లగడపాటి అందరికి బాగా గుర్తొస్తుంటాడు.
మొన్న తెలంగాణా ఎన్నికల ఫలితాల్లో తప్ప ప్రతిసారి లగడపాటి జోస్యం నిజం అవ్వడంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.ఏపీ తెలంగాణ విడిపోయిన తరువాత లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చినా నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తుండడంతో ఆయన టీడీపీ తరపున బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా నడిచింది.కానీ ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.
అయినా తన సర్వేలు మాత్రం ఆయన వదల్లేదు.ఎప్పటికప్పుడు జనం నాడి తెలుసుకుంటూ ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు.
కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడంలో లగడపాటి బాగా సక్సెస్ అయ్యారు.ప్రస్తుతం లగడపాటి విజయవాడలో ఎక్కువగా మకాం వేస్తూ రాజకీయాలను అంచనా వేసేపనిలో నిమగ్నం అయ్యారు.
ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్బాబు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాజగోపాల్ను మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు వెళ్లారు.గంటసేపు వారి మధ్య భేటీ జరిగింది.ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతలు రాజగోపాల్ను తెలుగుదేశం పార్టీలోకి రమ్మని కోరారు.దీనిపై లగడపాటి స్పందిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్న విషయానికి తాను కట్టుబడి ఉన్నట్టు వారితో చెప్పారు.
ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ పార్టీల బలా బలాలపైనా చర్చ జరిగింది.ఎన్నికల సమయం కావడంతో ఏపీలో ప్రజానాడిని పట్టుకునేందుకు ఈసారి లగడపాటి గట్టిగానే కష్టపడుతున్నారు.ఎందుకంటే తెలంగాణాలో సర్వే ఫలితాలు తారుమారైన నేపథ్యంలో ఇప్పుడు జాగ్రత్తగా ఫలితాలను అంచనా వేసే పనిలో లగడపాటి ఉన్నాడు.