ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డ్ కి చాలా దగ్గరలో ఉన్నాడు.రోహిత్ శర్మ కేవలం 90 పరుగులు చేస్తే ఐపీఎల్ టోర్నీ చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో ఆటగాడిగా రికార్డు అందుకుంటాడు.
ఇవాళ కోల్కత్తా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది.ఇక ఇది వరకు ఐదు వేల ఐపీఎల్ పరుగుల క్లబ్ లో కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా మాత్రమే ఈ లిస్టులో ఉన్నారు.
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఇంతవరకు 178 మ్యాచ్లు ఆడి ఏకంగా 5426 పరుగులు చేయగలిగాడు.ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 131.5 స్ట్రైక్ రేటుతో కొనసాగుతున్నాడు.అలాగే రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా 137.1 స్ట్రైక్ రేటుతో 197 మ్యాచ్ లలో 5,368 పరుగులు చేయగలిగాడు.ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ప్రస్తుతం 189 మ్యాచ్లలో 4910 పరుగులు చేసి ఉన్నాడు.
ఇక ఈ ఐపీఎల్ సీజన్ కి సురేష్ రైనా తన వ్యక్తిగత కారణాల వల్ల దూరం అయిన సంగతి అందరికీ తెలిసిందే.
రోహిత్ శర్మ విషయానికొస్తే 2008లో మొదలైన ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ లో చేరి తిరుగులేని కెప్టెన్ గా అంచెలంచెలుగా ఎదిగాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది.దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ ను గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు.
రోహిత్ శర్మ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడు సార్లు టోర్నీ విజేతగా నిలిచాడు.ఇక ఐపీఎల్ 2020 సీజన్ లో మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ కేవలం 10 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు మాత్రమే చేశాడు.
చూద్దాం మరి ఈ మ్యాచ్లోనైనా రోహిత్ శర్మ 5 వేల పరుగుల మార్క్ ను సాధిస్తాడో లేదో.