తాజాగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ టీ20 మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండవ ప్లేస్ దక్కించుకున్నారు.ఐతే రోహిత్ శర్మ టాప్ 2 ప్లేస్ కి చేరుకున్నది ఐసీసీ ర్యాంకింగ్స్ లో మాత్రం కాదు.
శనివారం రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ భీకరమైన బ్యాటింగ్ చేశారు.ఆయన 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు బాది 64 పరుగులు చేశారు.
అయితే ఈ మ్యాచ్ లో 60 పై చిలుకు పరుగులు చేసిన తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్ మ్యాన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.
ఇప్పటివరకు 111 టీ 20 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 2,864 పరుగులు చేశారు.
నిన్నటి వరకు రెండవ స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నారు.కానీ నిన్నటి టీ20 తర్వాత అతడిని వెనక్కినెట్టి రోహిత్ శర్మ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
అయితే విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో టీ20 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు.
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో కోహ్లీ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 80 పరుగులు సాధించారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేయడం వల్లనే నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించగలిగింది.నిన్నటి మ్యాచ్ లో గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్ శర్మ ని వరించింది.
సూర్యకుమార్ యాదవ్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసి టీమిండియా స్కోర్ ని విపరీతంగా పెంచేశారు.నిన్నటి మ్యాచ్ లో టీమిండియా 224 పరుగులు చేయగా.225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.