మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. కృషి, పట్టుదల ఓర్పు, నమ్మకం లాంటి ఆయుధాలు ఉంటే ఎంత పెద్ద యుద్దాన్నైనా జయించొచ్చు.
ఈ మాటనే నిజం అని రుజువు చేసింది ఓ మహిళ. స్వీపర్ స్థాయి నుంచి ఏకంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరి అందరిని ఆశ్చర్యపరిచింది.
అవమానాలు భరిస్తూ.సమస్యలను అధిగమిస్తూ.
తన బాధ్యతలు చేపడుతూ అత్యుత్తమ స్థాయికి ఎదిగింది.ఆమెను చులకనగా చూసిన జనాలతోనే శబాష్ అనిపించుకుంది.
తనని తిట్టిన వారే ముక్కుమీద వేళ్ళు వేసుకొనే స్థాయికి ఎదిగింది.అలల లాంటి సమస్యలను అధిగమించి ఆకాశాన్ని తాకే కీర్తిని సాధించింది.
ఆమె పేరే ఆశ.
రాజస్థాన్ లోని జోధాపూర్ కు చెందిన ఆశ ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడిపోయింది.అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు.వారిని పెంచే బాధ్యతను స్వీకరించిన ఆమె జోధాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ అవతారమెత్తింది.పొద్దున లేవగానే చీపురు పట్టి నగరంలోని రోడ్లు ఊడుస్తూ.సాయంత్రానికి ఇంటికి చేరి పిల్లలను చూసుకుంటూ ఉండేది.
ఇదే ఆమె దినచర్యగా మారింది.కానీ ఎదో ఒకటి సాధించాలనే తపన ఆమెకు ఎప్పుడూ ఉండేది.
నగరంలో రోడ్లు ఊడుస్తున్న సమయంలో పై అధికారులు పర్యవేక్షణ కోసం వస్తుంటే వారిని ఆమె గమనిస్తూ ఉండేది.ఎలాగైనా తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె డిసైడ్ అయ్యింది.
అనుకున్నదే తడువుగా కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసింది.ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తూ ఎగ్జామ్స్ కు ఇంట్లోనే సీరియస్ గా ప్రిపేర్ అయ్యింది.
అయితే ఆమె 2018లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆర్ఏఎస్ పరీక్ష రాసింది.కానీ కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా ఇటీవల ఫలితాలు వచ్చాయి.అందులో ఆశాకు 728వ ర్యాంక్ వచ్చింది.ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లో కూడా ఆశా ఉత్తీర్ణత సాధించింది.త్వరలో ఆమె డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనుంది.స్వీపర్ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన ఆశాను ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.
భర్తను వదిలేశావు అని చిన్నచూపు చూస్తూ అవమానించిన వారిని చదువు ద్వారానే సమాధానం చెప్పగలిగా అని ఆశా చెప్తున్నారు.ఏది ఏమైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మరోసారి రుజువైంది.