తెలుగు ప్రేక్షకులకి బొమ్మరిల్లు హాసిని అంటే వెంటనే గుర్తుకొచ్చే హీరోయిన్ జెనీలియా.ఆ సినిమాలో తన చైల్దిష్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులలో హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
బాయ్స్ సినిమాతో సౌత్ లో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో బిజీ అయిపొయింది.ఇక ఆమె కెరియర్ పీక్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో ప్రేమాయణం సాగించి తరువాత పెళ్లితో ఒకటయ్యారు.
వీరి పెళ్లి జరిగి ఏడేళ్ళకి పైగా అయిపొయింది.బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా వీళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఈ మధ్య మళ్ళీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి జెనీలియా రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా జెనీలియా, రితీశ్ జంట ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
తమ అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ అవయవదానం గురించి తామిద్దరం చాలా కాలంగా ఆలోచిస్తున్నామని తెలిపింది.
అయితే అది ఇంత వరకు కుదరలేదని చెప్పింది.డాక్టర్స్ డే సందర్భంగా అవయవాలను దానం చేస్తామనే ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పింది.
ఇతరులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి వారికి జీవితాన్ని ఇవ్వడమేనని తెలిపింది.ఇతరుల ప్రాణాలను కాపాడటానికి మీరు కూడా ముందుకు రండని అభిమానులకు పిలుపునిచ్చింది.
అవయవ దానం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరింది.మొత్తానికి వీళ్ళు ఒక మంచి పని ప్రారంభించడంతో పాటు దానికి అందరూ ముందుకి రావాలని ప్రచారం చేయడం నిజంగా గొప్ప విషయం.