గత కొద్ది నెలలుగా రాకెట్లా దూసుకు వెళ్లుతున్న పెట్రోల్ ధరలు ఒక్క సారిగా పెరగడం ఆగిపోయాయని సామాన్యుడు ఆనందపడ్డాడు.కానీ ఎన్నికలు ఉండటం వల్ల ఈ ధరలకు బ్రేకులు పడ్డాయని గ్రహించలేక పోయాడు.
అయితే కొందరు మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఖాయమని ముందుగా ఊహించారట.
ఇక ఇప్పటికే కరోనా వల్ల సామాన్యుడు తన తలకు మించిన భారాన్ని మోస్తున్న సమయంలో కనీసం పేదల కోసం ఆలోచించే తీరిక కూడా లేకుండా ప్రభుత్వాలు గడపడం విచారకరం.
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో కుస్తీ పడుతున్న సామాన్యుడు మళ్ళీ పెరుగుతున్న పెట్రోల్ ధరల భారాన్ని భరించడం తలకు మించిన భారమే అవుతుంది.
ఇకపోతే గత 18 రోజుల పాటు పెరగని పెట్రోల్ ధరలు మంగళవారం పెరిగాయి.
కాగా లీటరు పెట్రోలు పై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రకటన వెలువడింది.ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం.ఇదిలా ఉండగా ఇండియాలో పెట్రోల్ పై అధిక పన్నులు లేకుంటే, పెట్రోలు ధర లీటరుకు రూ.33 మించదని నిపుణులు భావిస్తున్నారట.కానీ ఆయిల్ రంగాన్ని తమకున్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించడం వల్ల ప్రజలకు ఈ తిప్పలు తప్పడం లేదు.