బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యలను పరిష్కరించే దిశగా ఆ దేశ కొత్త ప్రధాని భారత సంతతి మూలాలున్న రిషి సునక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వలసలను నిపిపివేయడం ద్వారా కొంత మేర సమస్యలు తగ్గుతాయని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకోబోతోందని వస్తున్న వార్తలు ఎంతో మంది వలస విద్యార్ధులలో ఆందోళనలను కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా బ్రిటన్ లో వలస విద్యార్ధులలో అత్యధిక శాతం మంది భారతీయ విద్యార్ధులే ఉండగా వారందరూ ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.ఒక వేళ రిషి సునక్ వలస నియంత్రణ పై నిర్ణయం గనుకా తీసుకుంటే ఇబ్బందులు పడేది అత్యధికశాతం మంది భారతీయ విద్యార్ధులే…అయితే
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల నేపధ్యంలో బ్రిటన్ లోని భారతీయ విద్యార్ధులు సంఘం నేషనల్ ఇండియన్ స్టూడెంట్ అండ్ అలుమ్ని యూనియన్ రిషి సునక్ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తిని చేసింది.
కేవలం చదువుకోవడానికి తాత్కాలిక వీసాపై బ్రిటన్ వచ్చే వారిని వలస దారులుగా చూడవద్దని విద్యార్ధి యూనియన్ చైర్మెన్ సనమ్ అరోనా అన్నారు.అలాగే భారతీయ విద్యార్ధుల కారణంగా ఏటా బ్రిటన్ కు 30 బిలియన్ పౌండ్స్ ఆదాయం లభిస్తోందని ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
అంతేకాదు బ్రిటన్ , ఇండియా ల మధ్య దౌత్య పరమైన, వాణిజ్య సంభంధాలు మెరుగు పడేందుకు వలస వస్తున్న విద్యార్ధుల పాత్ర కీలకమని ఆయన వెల్లడించారు.
ఏ వర్సిటీలు ఉన్నతమైనవి అని తేల్చడం, నిర్ణయాలు తీసుకోవడం ఇరు దేశాల మధ్య ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందని అన్నారు.తక్కువ స్థాయి డిగ్రీ లు చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిందని అయితే తక్కువ స్థాయి డిగ్రీ లు అంటే ఏమిటో ఇప్పటి వరకూ క్లారిటీ లేదని విద్యార్ధులు వాపోతున్నారు.కాగా బ్రిటన్ లోని వర్సిటీలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మాత్రం మండిపడుతున్నాయి.
వలస విద్యార్ధులపై ఆంక్షలు విధించడం వలన బ్రిటన్ పరువు పోగొట్టుకోవడమేకాకుండా ఆర్ధిక స్థితిపై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు.