లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి అనతి కాలంలోనే అందం, అభినయంతో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకుంది రిచా గంగోపాధ్యాయ.స్టార్ హీరోలతో మిరపకాయ్, సారొచ్చారు, మిర్చీ, భాయ్ లాంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ రిచా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగుతో పాటు తమిళంలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే హైయర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్లి రిచా సినిమాలకు గుడ్ బై చెప్పింది. పలువురు దర్శకనిర్మాతలు ఆమెను మళ్లీ సినిమాల్లో నటింపజేసే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.
అమెరికాకు వెళ్లిన తరువాత అక్కడ తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను రిచా వివాహమాడింది.సినిమాల కంటే చదువే ముఖ్యమని వెళ్లిపోయిన రిచా చివరి సినిమా మయక్కాం ఎన్నా.
తమిళంలో ధనుష్ కు జోడీగా రిచా ఈ సినిమాలో నటించగా బాక్సాఫీస్ దగ్గర మయక్కాం ఎన్నా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
నిన్నటితో ఈ సినిమా విడుదలై తొమ్మిది సంవత్సరాలైంది.ఈ సినిమా గురించి రిచా మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.అదే సమయంలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను రిచా వెల్లడించారు.
తను చిన్నప్పటి నుంచి కన్న కలలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.
జీవితంలో ఎటువంటి సమస్యలు, బాధలు లేవని ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ లో శిక్షణ తీసుకోవాలనే కోరికను నెరవేర్చుకున్నానని చెప్పారు.
సినిమాల్లో అవకాశాల వల్ల క్లోజ్ ఫ్రెండ్స్ కు దూరం కావాల్సి వచ్చిందని అమెరికాకు వెళ్లిన తరువాత మళ్లీ స్నేహితులకు దగ్గరయ్యానని రిచా గంగోపాధ్యాయ చెప్పుకొచ్చారు.చాలామంది సినిమాల్లో బిజీగా ఉంటే బాగుండేదని అనుకుంటారని తనకు మాత్రం కలలను నిజం చేసుకోవడమే అద్భుతమైన నిర్ణయం అనిపిస్తుందని పేర్కొన్నారు.