వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలంగాణలో మాత్రమే విడుదల అయిన ఈ చిత్రం ఏపీలో మాత్రం విడుదల కాలేదు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉన్న కారణంగా ఈ చిత్రంను అక్కడ విడుదల చేసేందుకు ఏపీ హైకోర్టు నో చెప్పింది.
విడుదలకు స్టే విధించిన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టు, సుప్రీం కోర్టు, సెన్సార్ ఇలా అన్ని చోట్లకు తిరిగి తిరిగి విసిగి పోయాడు.అయినా సినిమాను విడుదల చేసేందుకు అవకాశం దక్కలేదు.
ఏపీలో సినిమా విడుదల విషయంలో వర్మ చేతులు ఎత్తేశాడు.ఇక సినిమాను ఏపీలో విడుదల చేయడం తన వల్ల కాదని, చాలా ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాలేక పోయాం.ఇక మా వల్ల కాదు, ఏపీలో సినిమా విడుదల అవుతుందనే నమ్మకం లేదు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేశాడు.ఒక అలసి పోయిన కోతి బొమ్మను పోస్ట్ చేసిన వర్మ, కోతి మాదిరిగా తన సినిమాను కూడా బంధించారు, చాలా ఇబ్బంది కరంగా ఉన్న పరిస్థితులు సినిమా విడుదలకు అడ్డుకుంటున్నాయని వర్మ పేర్కొన్నాడు.
మొత్తానికి వర్మ సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకోవడంలో తెలుగు దేశం పార్టీ వారు సూపర్ హిట్ అయ్యారు.సెన్సార్ బోర్డు నుండి అడ్డుకున్న తెలుగు దేశం వారు, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు.సినిమాను ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విడుదల చేయకుండా ఉండేందుకు వారు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఎన్నికలు పూర్తి అయిన తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ను ఏపీలో విడుదల చేస్తే ప్రయోజనం ఉండదని, కనీసం కోటి రూపాయలు కూడా రావని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఇప్పుడు విడుదలై ఉంటే 10 కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.