హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.ఈ నియోజకవర్గంలో పట్టు సంపాదించేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను అమలు చేశారు.
ప్రజల్లో బలం పెంచుకునేందుకు పాదయాత్ర చేస్తూ, ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశారు.జాతీయ నేతలను సైతం ఎన్నికల ప్రచారానికి దింపడం, భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయించడం వంటి వ్యవహారాలు చేపట్టారు.
హుజూరాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో, మళ్లీ తమ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించుకునేందుకు ఆ పార్టీ అన్ని వ్యూహాలను అమలు చేసింది.ఇక బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేశారు.
ఆయన ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తుండడంతో మళ్ళీ అదే ఫలితం రిపీట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది.పోటీ అంతా టీఆర్ఎస్ బిజెపిల మధ్య నెలకొంది అనే విషయం పోలింగ్ సరళిని బట్టి అర్థం అయిపోయింది.కాంగ్రెస్ విజయం పై మొదట్లో కాస్త ధీమా కనిపించినా, అనేక సర్వేల రిజల్ట్స్ తరువాత ఫలితం తమకు నిరాశ కలిగిస్తుంది అని అంచనాకు వచ్చారు .అందుకే తాము గెలవక పోయినా ఫర్వాలేదు టిఆర్ఎస్ అభ్యర్థి మాత్రం గెలవకూడదు అనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి పని చేసినట్లుగా అర్థం అవుతోంది.టిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే, ఆ ఎన్నికల ఫలితం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని, అప్పటి పరిస్థితులను బట్టి బిజెపి ప్రభావాన్ని తగ్గించి తాము సులువుగా అధికారాన్ని సంపాదించవచ్చనే ఎత్తుగడతో రేవంత్ ఉన్నారట .
అందుకే టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా రేవంత్ సభలు సమావేశాలు, ప్రసంగాలు ఉన్నాయట.అసలు మొదటి నుంచి రేవంత్ వైఖరిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.ఇక్కడ కాంగ్రెస్ కావాలని పెద్దగా బలం లేని విద్యార్థి నాయకుడు బల్మూర్ వెంకట్ ను పోటీకి పెట్టిందని , పరోక్షంగా ఈటల రాజేందర్ కు సహకారం అందించేందుకు ఎన్నికల ప్రచారం కూడా ఆలస్యంగా మొదలు పెట్టిందనే చర్చ సైతం నడిచింది.ఏది ఏమైనా సాయంత్రానికి ఎన్నికల ఫలితం వెలువడనుంది.