తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసేందుకు తన శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తున్నారు.పార్టీ సీనియర్లు సహకరించినా, సహకరించకపోయినా తాను మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, ఎంపీగా ఉన్నా, పిసిసి అధ్యక్షుడిని కావాలి అనే ఆలోచనతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు.ఈ విషయంలో అడుగడుగున పార్టీ సీనియర్ నేతలు అడ్డం పడుతూ వస్తున్నా, రేవంత్ మాత్రం షరా మామూలుగానే రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు.
నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యపై అటు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాడుతూనే, మరోపక్క బలమైన శత్రువు గా మారబోతున్న బీజేపీతోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి పోరాటం చేస్తూ , కాంగ్రెస్ కు జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగానే ఉంది.
కాకపోతే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మిగతా సీనియర్ నాయకులు అలుగుతారేమో అనే భయమూ కాంగ్రెస్ అధిష్టానం లో ఉండడంతో పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేయకుండా ఇంకా వెయిటింగ్ లో నే పెట్టింది.ప్రస్తుతం కేంద్ర బీజేపీ ప్రభుత్వం తో పాటు , తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తో ఆ సమస్యలపై పోరాడాలని , దీనిలో భాగంగానే భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభకు వచ్చిన రెస్పాన్స్ కు అనుగుణంగా తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా అర్థం అవుతోంది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, కొత్తగా పార్టీ పెట్టబోతున్న షర్మిల సైతం పాదయాత్ర, భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో తాను భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఈ భారీ సభ ద్వారా తన స్థాయి ఏమిటో తన రాజకీయ ప్రత్యర్దులను తో పాటు, సొంత పార్టీలోని నేతలకు తెలిసొచ్చేలా చేయాలని రేవంత్ చూస్తున్నారట.