ఎట్టకేలకు అనుకున్న లక్ష్యంలో తొలిమెట్టు ఎక్కేశారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి .ఎన్నో ట్విస్ట్ లు, మరెన్నో అవరోధాలు ఇంకా ఎన్నో ఇబ్బందులు అన్నిటిని దాటుకుని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పదవిని దక్కించుకున్నారు.
ఈ పదవి రేవంత్ కి కట్టబెడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఎంతో మంది సీనియర్ నాయకులు అధిష్టానం పై ఒత్తిడి చేసినా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గలేదు.కాంగ్రెస్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయనకే పదవి కట్టబెట్టింది.
ఇక రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కడంతో ఆయన మద్దతుదారులు సందడి గట్టిగానే చేశారు.ముఖ్యంగా గాంధీ భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది.
అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న రేవంత్ ఇక తర్వాత స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది అందరికీ ఆశక్తికరంగానే మారింది.అయితే రేవంత్ ముందు నుంచి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందనే ధీమాతోనే ఉంటూ వచ్చారు.
ఆ పదవి దక్కిన తర్వాత ఏం చేయాలని టార్గెట్ ను ముందుగానే విదించుకున్నారు.దీనిలో భాగంగానే తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు.ఇక వైసిపి అధినేత జగన్ సైతం పాదయాత్ర చేపట్టి తిరుగులేని అధికారం దక్కించుకున్న విషయాన్ని రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.
పాదయాత్ర చేపడితే జనాల్లో సులువుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు అనేది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.
కెసిఆర్, కేటీఆర్ అవినీతి వ్యవహారాలు, టిఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలన గురించి జనాలకు తెలిసేలా ప్రచారం చేసేందుకు, అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర ఒక్కటే మార్గం గా రేవంత్ అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే రేవంత్ పాదయాత్ర కు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఈ యాత్ర ద్వారానే తెలంగాణ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించడంతో పాటు, తెలంగాణ ముఖ్యమంత్రి గానూ బాధ్యతలు స్వీకరించే స్థాయికి తన బలాన్ని పెంచుకోవాలి అనేది రేవంత్ ప్లాన్ గా కనిపిస్తోంది.