తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు.తెలంగాణలో బలం పెంచుకునేందుకు రకరకాల మార్గాల్లో ఆయన ప్రయత్నం చేస్తున్నారు.
సొంత పార్టీలోనే అసంతృప్త నాయకులను ఒకపక్క బుజ్జగిస్తూనే మరోవైపు రాజకీయ శత్రువులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎదుర్కోబోతుండడం తో ప్రతిష్టాత్మకంగా ఆయన ఎన్నికలను తీసుకున్నారు.
ప్రస్తుతానికి తెలంగాణలో బిజెపికి కాస్తో కూస్తో ఆదరణ ఉన్నట్టుగా కనిపిస్తున్నా, రాబోయే రోజుల్లో అది మరింతగా క్షీణిస్తుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంగా ఉందని, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలంగాణలోనూ కనిపిస్తుందని రేవంత్ నమ్ముతున్నారు.
తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడం ద్వారా, తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందనేది రేవంత్ అభిప్రాయం.
అందుకే హుజురాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా, గెలవకపోయినా టిఆర్ఎస్ అభ్యర్థిని మాత్రం గెలవకూడదు అనే లెక్కల్లో రేవంత్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే వ్యూహాత్మకంగా బిజెపి అభ్యర్థి, హుజూరాబాద్ నియోజకవర్గం లో గట్టి పట్టు ఉన్న ఈటెల రాజేందర్ పై రేవంత్ పెద్దగా విమర్శలు చేయడం లేదు.
తమ ప్రధాన టార్గెట్ అంతా కేసీఆర్ అన్నట్లు వ్యవహరిస్తూ, టిఆర్ఎస్ కు ఈ నియోజకవర్గంలో విజయం దక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
పదే పదే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ, అవినీతి వ్యవహారాలు ప్రస్తావిస్తూ, ఇక్కడ ఆ పార్టీ ఓటమి చెందే విధంగా రేవంత్ విమర్శలకు పదును పెడుతున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి గెలవక పోయినా ఫర్వాలేదు కానీ , టిఆర్ఎస్ గెలవకూడదనే లక్ష్యంతోనే రేవంత్ వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.అందుకే బీజేపీ పై పెద్దగా విమర్శలు చేయకుండా టీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ రాజకీయం నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.